Nepal Floods : ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపాల్‌ వరదల్లో వెయ్యిమందికి పైగా మరణించారు. వేలాది మంది జాడ ఇంతవరకు తెలియరాలేదు. అందులో నేపాల్‌ వాసులే కాక పలు దేశాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు. కాగా, ఈ వరదల్లో పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కూడా వరద ఉధృతికి కొట్టుకొని పోయాయి. అనేక నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. అయితే ఒక ఇల్లు మాత్రం నేపాల్ వరదలను తట్టుకుని నిలబడింది. ఆ ఇంట్లోని వారు వరదల్లో చిక్కుకుని ఇంటిలోపలే ఉండిపోయినప్పటికీ ఆ ఇంటికి ఏం కాకపోవడం గమనార్హం. కాగా ఆ ఇంటికి సంబంధించిన వీడియో ఇటీవల కాలంలో విపరీతమైన వైరల్‌గా మారింది. నాటి అద్భుతానికి కారణం ఎంటనేది తాజాగా ఆ ఇంటి ఓనర్ వివరించారు.

Also Read : 26వ తేదీ అంటేనే ప్రకృతి విపత్తులా..? 96 ఏళ్లుగా వెంటాడుతున్న సెంటిమెంట్!

నేపాల్ లో ఓ వైపు భారీగా వరదలు చుట్టుముట్టినప్పటికీ వాటిని తట్టుకుని నిలబడ్డ ఆ ఇల్లు నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో ఉంది. పెద్ద ఎత్తున వచ్చిన వరదనీటికి ఆ ఇంటి చుట్టూ ఉన్న ఇళ్లన్నీ జలసమాధి అవుతున్నా ఆ భవనం మాత్రం చెక్కు చెదరకుండా నిలబడ్డ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమై ఆ ఇంటి ఓనర్ ప్రకాశ్ ఈవాళ మీడియాతో మాట్లాడారు. అంతా పెద్ద వరద వస్తున్న సమయంలో ఆయన ఆ భవనంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా నాటి అనుభవాలను మీడియాకు వెళ్లడించారు.

Also Read : సింధు జలాలపై కోర్టు తీర్పు.. దానికి ఆ పరిధిలేదన్న భారత్…

“మా ఇంటిని వరద చుట్టుముట్టే సమయంలో ఆ భవనంలో నాతో పాటు నా కుటుంబసభ్యులు ఐదుగురు ఉన్నారు. మొదట నేను బయట ఒక షాపు వద్ద ఉండగా వరద అలర్ట్ వచ్చింది. వెంటనే నేను ఇంటికి చేరుకున్నాను. అందరినీ తీసుకుని బయటకు వెళదామనుకున్నాను. కానీ అప్పటికే బయట నీటి ఉధృతి బాగా పెరిగింది. దీంతో, మేము మొదట నాలుగో అంతస్తుకు వెళ్లాము. అక్కడికి కూడా నీరు వచ్చి చేరడంతో చివరకు భవనంపైకి వెళ్లాము. ఆ సమయంలో నా ఆలోచన అంతా నా కటుంబాన్ని ఎలా రక్షించుకోవాలనే దానిపైనే ఉంది.’

‘ మేమంతా వరదల్లో చిక్కుకున్న సమయంలో నా కొడుకు స్కూల్లో ఉన్నాడు. మాకు ఏమైనా అయితే వాడి పరిస్థితి ఏంటన్న ఆందోళన మాలో పెరిగిపోయింది. అదృష్టవశాత్తూ కొంత సేపటికి వరద ఉధృతి తగ్గింది. మాకు ప్రాణాపాయం తప్పింది’ అని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాగా, ఆ రోజు వరద ఉధృతికి దాదాపు గంట పాటు ఆ కుటుంబం భవనంపైనే ఉండిపోవలసి వచ్చింది. ఆ తరువాత స్థానికులు కొందరు వచ్చి వారిని రక్షించారని ఆయన తెలిపారు. తమ ఇల్లు అంతటి వరద ఉధృతిని తట్టుకోవడానికి కారణం ఇంటి నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలే అని ఆయన వివరించారు.

‘మేమున్న ఇల్లు దాదాపు 40 ఏళ్ల నాటి భవనం. అప్పట్లో సిమెంట్, ఇతర సామగ్రి నాణ్యత ఇప్పటి కంటే బాగుండేది. ఇంటి నిర్మాణం విషయంలో కూడా చాలా ఆలోచించి అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. నదీతీరానికి సమీపంలో ఉండటంతో గట్టి పునాదితో నిర్మించాం. దీంతో, భవనం అంతటి వరదను కూడా తట్టుకోగలిగింది’ అని ఆయన వివరించారు. అంతేకాదు మళ్లీ అదే ఇంట్లో ఉండేందుకు తాను సిద్ధమేనని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే, వరద కారణంగా దిగువ అంతస్తులు కొంత దెబ్బతిన్నాయని వాటిని మరమ్మత్తు చేయాల్సి ఉందని తెలిపారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.