
Kolkata Warehouse Collapse : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో బుధవారం మధ్యాహ్నం ఒక ఘోర ప్రమాదం సంభవించింది. నగరంలోని తారాతలా పారిశ్రామిక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భారీ మూడు అంతస్తుల వేర్హౌస్ (గోదాం) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, డజన్ల కొద్దీ వర్కర్లు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
The roof of a factory collapsed in the Alipore area.
At least 40 workers are trapped inside.
People trapped under the debris can be heard calling for help. pic.twitter.com/IDdQnaW3H9
— Facts (@BefittingFacts) June 24, 2026
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తారాతలాలోని సదరు గిడ్డంగిలో బుధవారం ఉదయం నుంచి కార్మికులు తమ రోజువారీ నిర్మాణ పనులలో నిమగ్నమై ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దాదాపు 50 మంది వరకు కార్మికులు పనులు చేస్తున్నట్లు సమాచారం. మధ్యాహ్నం వేళలో భవనానికి సంబంధించిన భారీ పైకప్పు (రూఫ్) భాగం ఒక్కసారిగా కుప్పకూలి కింద పడింది. ప్రమాదం చాలా వేగంగా జరగడంతో, లోపల ఉన్న కార్మికులకు కనీసం బయటకు తప్పించుకునే సమయం కూడా దొరకలేదు.
భవన నిర్మాణంలో భారీ కాంక్రీట్ స్లాబ్లతో పాటు పెద్ద పెద్ద ఇనుప స్తంభాలు (పిల్లర్లు) వాడటం వల్ల ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. టన్నుల కొద్దీ కాంక్రీట్, ఇనుప వ్యర్థాలు కార్మికులపై పడటంతో దాదాపు 30 మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే కోల్కతా సిటీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు (SDRF) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
భారీ ఇనుప స్తంభాలు, కాంక్రీట్ దిమ్మెలు అడ్డంగా పడి ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం అధికారులకు అత్యంత కష్టసాధ్యంగా మారింది. దీంతో శిథిలాలను వేగంగా తొలగించేందుకు భారీ క్రేన్లు, ఇనుప రాడ్లను కట్ చేయడానికి గ్యాస్ కట్టర్లను రంగంలోకి దించారు. ఇప్పటివరకు రెస్క్యూ టీమ్స్ శ్రమించి శిథిలాల కింద నుంచి పది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీశాయి.
ప్రస్తుతం లోపల చిక్కుకున్న మిగతా వారిని వీలైనంత త్వరగా ప్రాణాలతో బయటకు తీసుకురావడమే లక్ష్యంగా సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ వేర్హౌస్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా సాంకేతిక లోపం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.









