india water

BIG BREAKING :  పాకిస్తాన్ భారత్ పైకి ఉగ్రవాదులను పంపించడం ఆపనంత వరకు, ఆ దేశంతో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్రం మరోసారి గట్టిగా చెప్పింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నందున ఈ నీటి ఒప్పందాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గత ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది సాధారణ ప్రజలు చనిపోయారు. ఆ ఘటన తర్వాతే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, పాకిస్తాన్ ముందుగా ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపితేనే నీటి గురించి మాట్లాడుతామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

ఇలా భారత్ నీటిని ఆపేయడంతో పాకిస్తాన్‌లో నీటి కష్టాలు చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా అక్కడ వ్యవసాయం చేసుకునే ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పాకిస్తాన్ నాయకులు భారత్‌పై కోపంతో ఊగిపోతున్నారు. సింధు నది తమ దేశానికి జీవనాడి లాంటిదని, భారత్ నీటిని ఒక ఆయుధంగా వాడుకుంటూ తమను ఇబ్బంది పెడుతోందని పాకిస్తాన్ నేత బిలావల్ భుట్టో ఆరోపించారు. ఒక దేశం అనుకుంటే ఈ ఒప్పందం ఆగిపోదని అక్కడి మంత్రులు అంటున్నారు. కానీ, పాకిస్తాన్ ఉగ్రవాదులను అణచివేసే వరకు తమ నిర్ణయం మారదని భారత్ సూటిగా చెప్పేసింది.

తీస్తా నది ప్రాజెక్ట్ గురించి

ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో కట్టాలనుకుంటున్న తీస్తా నది ప్రాజెక్ట్ గురించి కూడా భారత్ మాట్లాడింది. తీస్తా నది విషయంలో తమ అభిప్రాయం ఏంటో ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెప్పామని విదేశాంగ శాఖ పేర్కొంది. బంగ్లాదేశ్‌తో మన దేశానికి ఉన్న సంబంధాలు ఎప్పుడూ చర్చల ద్వారానే సాగుతాయని చెప్పింది. అయితే, ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ చైనా దేశానికి వెళ్లి, ఈ తీస్తా నది ప్రాజెక్ట్ కోసం చైనాతో చేతులు కలిపారు. తమ దేశంలో నీటి కొరత ఎక్కువగా ఉందని, అందుకే ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని బంగ్లాదేశ్ అంటోంది.

భారతదేశ సరిహద్దుకు దగ్గరగా ఉండే బంగ్లాదేశ్ ప్రాంతాల్లో నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. అందుకే వారు నదులు, కాలువలను బాగు చేసుకోవాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో చైనా రావడంపై భారత్ అలర్ట్ అయింది. చైనా వాళ్లు మాత్రం తాము బంగ్లాదేశ్‌కు సహాయం చేస్తున్నాం కానీ భారత్‌కు వ్యతిరేకం కాదని చెప్తున్నారు. ఏది ఏమైనా అక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ గమనిస్తూ, మన దేశ ప్రయోజనాలకు తగ్గట్టుగానే తీస్తా నది విషయంలో ముందడుగు వేస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

 

 

 

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.