Petrol and diesel price : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు..మరిన్ని రోజులు పెరిగే ఛాన్స్.. నిపుణుల హెచ్చరిక!

Petrol and diesel price :పెట్రోల్, డీజిల్ ధరలు రాబోయే 3 నుండి 4 నెలల పాటు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు నిరంతరం పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.ఇటీవలే ఇంధన ధరలను లీటరుకు 3 రూపాయల చొప్పున పెంచినప్పటికీ, ఈ పెరుగుదల ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయాల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర శుక్రవారం నాటికి బ్యారెల్‌కు 110 డాలర్ల సమీపానికి చేరుకుంది.

భారతదేశంలో దాదాపు 4 సంవత్సరాల తర్వాత మే 15న పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్రభుత్వ రంగ చమురు పంపిణీ సంస్థలపై (OMCs) తీవ్ర ఒత్తిడి పడుతోంది. ప్రస్తుత ధరల పెంపు వల్ల కంపెనీలకు జరుగుతున్న నష్టాల్లో కొంత భాగం మాత్రమే భర్తీ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.మాస్టర్ పోర్ట్‌ఫోలియో సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా తెలిపిన వివరాల ప్రకారం… బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటికే 110 డాలర్ల మార్కుకు చేరుకుంది. ఒకవేళ ముడి చమురు ధరలు దీర్ఘకాలం పాటు 90-100 డాలర్ల కంటే పైనే కొనసాగితే, రాబోయే 3-4 నెలల్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగడం ఖాయం.

 ఛాయిస్ ఎనర్జీ అనలిస్ట్ ధవల్ పోపట్ ప్రకారం…ఇంధన ధరలను లీటరుకు రూ. 1 పెంచితే, మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థల వార్షిక ఆదాయం  సుమారు రూ. 15,000 నుండి 16,000 కోట్లు మెరుగవుతుంది. ప్రస్తుత రూ. 3 పెంపు వల్ల కంపెనీలకు ఏడాదికి రూ. 45,000 నుండి 48,000 కోట్ల లాభం చేకూరుతుంది. కానీ, ప్రస్తుత నష్టాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే ఉండి, ముడి చమురు ధరలు తగ్గకపోతే… చమురు కంపెనీల నష్టాల పూర్తిగా భర్తీ కావడానికి మొత్తంగా లీటరుకు రూ. 10 వరకు ధరలు పెంచాల్సి ఉంటుందని అంచనా.

 భారతదేశం తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85% దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో జరిగే మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు  దేశీయ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచ చమురు సరఫరా నిలిచిపోతుందనే భయాందోళనలు పెరిగాయి. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. రిటైల్ ధరలను మరింత పెంచకపోతే చమురు కంపెనీల లాభాలు దారుణంగా పడిపోతాయి.

సామాన్యుడిపై పడే ప్రభావం
ఇంధన ధరలు పదే పదే పెరగడం వల్ల రవాణా మరియు లాజిస్టిక్స్ ఖర్చులుభారీగా పెరుగుతాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం (Inflation) ఎక్కువవుతుందని, ఇది సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ను దెబ్బతీస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో ధరల పెరుగుదలను నియంత్రించడంలో ప్రభుత్వ జోక్యం (సబ్సిడీలు లేదా పన్నుల తగ్గింపు) కీలక పాత్ర పోషించనుంది.