TG New Ration Cards : తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)కు సంబంధించి ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లబ్ధిదారులందరికీ స్మార్ట్‌ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గతంలో ఉన్న రేషన్‌ కార్డుల మాదిరి కాకుండా వాటి ప్రామాణికతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుటుంది. నకిలీ, అక్రమ కార్డులను నిరోధించడానికి ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న రేషన్‌ కార్డులను అత్యంత రక్షణతో తయారు చేస్తోంది. ముఖ్యంగా కొత్త కార్డుల్లో  9 సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరుస్తోంది. దీనికోసం చాలా సున్నితమైన కంటికి కనిపించని కేవలం స్పర్శద్వారా మాత్రమే గుర్తించే డిజిటలైజ్‌ టెక్నాలజీని వీటికి వాడుతోంది.

Also Read : పార్టీ గీత దాటితే వేటే.. పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

ఇక  కార్డుపై ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ’ అనే అక్షరాలను పైకి ఉబ్బినట్లుగా ముద్రించే రిలీఫ్‌ టెక్స్ట్‌ను వాడుతోంది. చేతితో తాకితే అక్షరాలు తగిలేలా ఇది ఉంటుంది. దీనికి తోడు కార్డులో సూక్ష్మ అక్షరాలను కూడా పొందుపరిచారు. అత్యంత చిన్న అక్షరాల్లో ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ’ పదాలను మరోసారి ముద్రిస్తారు. అయితే ఇవి సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించవు. కానీ మాగ్నిఫికేషన్‌తో పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ‘డ్యూయల్‌ హిడెన్‌ ఇమేజ్‌’ అనే సాంకేతికతను కూడా కార్డులో ఉపయోగిస్తున్నారు. ఒకదానిపై మరొకటి సూపర్‌ ఇంపోజ్‌ చేసిన అక్షరాలు లేదా గుర్తులు నిర్దిష్ట కోణంలో లేదా మాగ్నిఫికేషన్‌తో పరిశీలించినప్పుడు కనిపించేలా వీటిని వినియోగించారు. ఇందులో ‘జీవో టీజీ ఒరిజినల్‌’ వంటి రహస్య గుర్తులను వాడారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో వాటర్‌మార్క్‌ను కూడా కార్డుపై వాడుతున్నారు. ఈ వాటర్‌మార్క్‌ను వెలుతురుకు ఎదురుగా ఉంచినప్పుడు స్పష్టంగా కనిపించేలా తయారు చేశారు.

కార్డుపై ఇన్విజిబుల్‌ యూవీ లోగోను కూడా ముద్రిస్తున్నారు. ఈ లోగో అల్ర్టావయెలెట్‌ కాంతి కింద మాత్రమే కనిపించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కార్డు వెనుక భాగంలో ఎన్‌క్రిప్టెడ్‌ క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంటుంది. కార్డులోని సమాచారాన్ని అనధికారికంగా కాపీ చేయడం, మార్చడం లేదా డూప్లికేట్‌ చేయడాన్ని నిరోధించడానికి దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కార్డు బ్యాక్‌గ్రౌండ్‌లో సంక్లిష్టమైన గీల్లొష్‌ ప్యాటర్న్‌ను కూడా ఉపయోగించారు. క్లిష్టమైన డిజైన్‌ కారణంగా దీని నకలు రూపొందించడం సాధ్యపడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Also Read : హైదరాబాద్‌లో 65 అంతస్తుల ట్రంప్ టవర్స్.. ప్రత్యేకతలేంటో తెలిస్తే షాక్

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.