తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల సమగ్ర సర్వే, వివరాల పరిశీలన విషయంలో సినీ, క్రీడా ప్రముఖులకు అధికారులు SIR నోటీసులు జారీ చేశారు. ఎన్నికల అధికారులు చేపట్టిన ఓటర్ల వివరాల ఎన్యూమరేషన్ ప్రక్రియలో సమర్పించిన పత్రాలలో కొన్ని తప్పులు, పొరపాట్లు ఉండటంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితాను పక్కాగా, పారదర్శకంగా రూపొందించడంలో భాగంగా అధికారులు ప్రతీ ఒక్కరి వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖులు సమర్పించిన దరఖాస్తుల్లోని పేర్లు, చిరునామాలు లేదా ఇతర సమాచారంలో కొన్ని తేడాలు ఉన్నట్లు గురించిన యంత్రాంతం.. వాటిని సరిచేసుకోవాలని సూచిస్తూ ఈ SIR నోటీసులను జారీ చేసింది.

Also Read : శివాజీ నటుడు కన్నుమూత… రజినీకాంత్ సంతాపం!

ఈ నోటీసులు అందుకున్న వారి జాబితాలో టాలీవుడ్ ప్రముఖులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడా దిగ్గజాలు కూడా ఉన్నారు. సినీ రంగానికి సంబంధించి సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, విక్టరీ వెంకటేష్, స్టార్ హీరోయిన్ సమంత, యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మెగా కోడలు ఉపాసన కొణిదెల ఉన్నారు. వీరితో పాటు క్రీడా రంగానికి చెందిన భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, మహిళా క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ దిగ్గజాలు పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్‌లకు కూడా ఈ నోటీసులు వెళ్లాయి.

అయితే ఈ ప్రముఖులంతా తరచూ షూటింగ్స్, మ్యాచ్‌లు, వ్యాపార ప్రయాణాల వల్ల బిజీగా ఉంటారనే విషయాన్ని గుర్తించిన ఎన్నికల అధికారులు వారికి ఒక కీలక మినహాయింపును ఇచ్చారు. నోటీసులు అందుకున్న ప్రముఖులు నేరుగా విచారణకు హాజరు కాలేని పరిస్థితి ఉంటే తమ తరఫున ఒక ప్రతినిధిని పంపవచ్చని అధికారులు తెలిపారు. తమ స్థానంలో మరొకరికి విచారణకు హాజరయ్యేందుకు అధికారం ఇస్తూ లేఖ ఇస్తే సరిపోతుందన్నారు. ఆ ప్రతినిధి సరైన ఆధార పత్రాలను సమర్పించి ఓటరు వివరాల్లోని తప్పులను సరిచేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

Also Read : ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయి వివాదంలో బిగ్ ట్విస్ట్