Analogue Dairy Products : కృత్రిమ పన్నీర్, నెయ్యి, కోవా ఉత్పత్తి, విక్రయాలపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కృత్రిమ డైరీ ఉత్పత్తుల తయారీ, విక్రయాలపై సంపూర్ణ నిషేధం విధించింది. మిల్క్ ఫ్యాట్‌కు బదులుగా వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలు ఉపయోగించి తయారుచేసే ఈ ఉత్పత్తుల అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే నకిలీ, కృత్రిమ డైరీ ఉత్పత్తుల తయారీ, విక్రయాలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కన్నెర్ర చేశారు. ఆ ఉత్పత్తులను నిషేదిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.. మిల్క్ ఫ్యాట్‌కు బదులుగా వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలు ఉపయోగించి తయారుచేసే ‘అనలాగ్’ పన్నీర్, నెయ్యి, కోవాల విక్రయాలను రాష్ట్రంలో పూర్తిగా నిషేధిస్తూ విజిలెన్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FSDA) అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వీటి ఉత్పత్తులను ఇప్పటికే ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

కాగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం పాలు, పాల ఉత్పత్తులను వాటి సహజ రూపంలోనే తయారుచేసి విక్రయించాలని చెబుతోంది. అయితే, యూపీలోని పలు జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో పాల ఉత్పత్తులలో రిఫైన్డ్ ఆయిల్స్, వెజిటబుల్ ఫ్యాట్స్, సోయాబీన్ ఉత్పత్తులు కలపుతున్నట్లు నిర్ధారణ అయింది. ఇవే కాదు కొన్ని ప్రాంతాల్లో టాల్కమ్ పౌడర్, డిటర్జెంట్లు, టైటానియం డయాక్సైడ్, లిక్విడ్ గ్లూకోజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి హానికర రసాయనాలను కలుపుతున్నట్లు కూడా తేలింది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఇటువంటి నకిలీ ఉత్పత్తులను నిరోధించడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏదైనా ప్రాసెసింగ్ లేదా తయారీ కేంద్రంలో విదేశీ కొవ్వులు, లేదా హానికరమైన రసాయనాలు లభించినట్లయితే ఆ యూనిట్‌లోని పాల ఉత్పత్తులన్నింటినీ తక్షణమే సీజ్ చేసి ధ్వంసం చేస్తారని తెలిపింది. అలాగే ఎమర్జెన్సీ ప్రొహిబిషన్ ఆర్డర్ (Section 34) ప్రకారం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సదరు ప్లాంట్ లేదా సంస్థలో ఉత్పత్తి పనులను తక్షణమే నిలిపివేస్తూ అత్యవసర నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తారు.

పాల ఉత్పత్తుల్లో వ్యవస్థీకృతంగా ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నట్లు తేలితే భారతీయ న్యాయ సంహిత (BNS) కింద యజమానులపై ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటారు.
నేరం చేసినట్టు రుజువైతే ఫుడ్ సేఫ్టీ నిబంధనల కింద సంబంధిత సంస్థ ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్‌ను వెంటనే సస్పెండ్ చేస్తారు. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే పాల ఉత్పత్తులలో కూడా ఇటువంటి కల్తీలు ఉన్నట్లు ఆధారాలు గనుక దొరికితే ఆ నిర్దిష్ట బ్రాండ్‌ విక్రయాలపై రాష్ట్రమంతటా పూర్తి స్థాయి నిషేధం విధిస్తారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.