
Arunachal Flash Flood : అరుణాచల్ప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ర్టంలో భారీ వర్షాలు ముంచేత్తుతున్నాయి. ఎగువ సుబన్సిరి, దిబాంగ్ వ్యాలీ జిల్లాల్లో వర్షం తాకిడికి కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల మూలంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక వరదల వల్ల భారత సైన్యానికి చెందిన ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
Also Read : 1947లో మీరు రూ. 1,000 విలువైన బంగారం కొనుగోలు చేసి ఉంటే, నేడు దాని విలువ ఎంతో తెలుసా?
ఎగువ సుబన్సిరి జిల్లాలో ఇక్కసారిగా కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలు మొదలుపెట్టింది. ఘటన జరిగిన ప్రాంతంలో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక బృందాలకు సవాలుగా మారింది. ఇక, దిబాంగ్ వ్యాలీ జిల్లాలో ఒక్కసారిగా ముంచుకొచ్చిన ఆకస్మిక వరదలుతో ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వారిని గుర్తించేందుకు సైన్యం, స్థానిక యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారిని హవల్దార్ ఉపేందర్, కుందన్, వినోద్, ఆదిత్య, సముందాగా చెబుతున్నారు.
వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో అరుణాచల్ లోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది . ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు, వాగుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదులు, వాగుల ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గల్లంతైన సైనికుల కోసం గాలింపు కొనసాగుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం అయితే తప్ప ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read : సెక్యూరిటీ గార్డు వేషంలో టెర్రరిస్ట్ కుట్ర.. బెంగాల్ యువకుడు అరెస్ట్!









