
శ్రావణమాసంలో ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్కు సాగిన కవ్వర్ యాత్ర తర్వాత పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈసారి యాత్రకు సుమారు 5 కోట్ల మంది వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తుండగా వారి ద్వారా దాదాపు 7 వేల టన్నుల వ్యర్థాలు హరిద్వార్లో పేరుకుపోయాయని వెల్లడించారు.
కన్వర్ యాత్ర పూర్తయిన తర్వాత భక్తులు పూజుల నిర్వహించిన ఘాట్లు, ప్రయాణించిన రహదారులు, పలు పార్కింగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్లాస్టిక్, వదిలేసిన దుస్తులు, పూజలకు సంబంధించిన సామగ్రి పెద్ద ఎత్తున పేరుకుపోయిందని అధికారులు వివరించారు. యాత్ర ముగిసిన అనంతరం హరిద్వార్లోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 7,000 టన్నుల చెత్తను సేకరించామని, దాన్నంతా డంపింగ్ యార్డులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. హర్ కీ పౌరీ వద్ద ఉన్న గదుల్లో చాలామది సీసలు వదిలిపెట్టారని, అలా వదిలిపెట్టిన నీటి సీసాల్లో మూత్రం నింపి ఉండటం కూడా వెలుగులోకి వచ్చిందని అధికారులు సంచలన విషయాన్ని భయటపెట్టారు. ఆ సీసాలను పారిశుద్ధ్య కార్మికులు చేతి తొడుగులు, మాస్కులు లేకుండానే తొలగిస్తున్న దృశ్యాలు సంచలనంగా మారాయి. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భక్తితో గంగాజలాన్ని సేకరించేందుకు వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించే భక్తులు, తిరిగి వెళ్లేటప్పుడు అదే పవిత్ర నది పరిసరాలను చెత్తతో నింపడం దారుమని స్థానికులు వాపోతున్నారు. వారు వదిలిన చెత్తను తొలగించేందుకు వందకు పైగా ఘాట్లలో పారిశుద్ధ్య సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన రహదారులను శుభ్రం చేసే పనిలో పారిశుద్ధ్య సిబ్బంది ఇంకా శ్రమిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ నందన్ కుమార్ తెలిపారు. హరిద్వార్లోనే కాకుండా గంగోత్రి ప్రాంతంలో కూడా యాత్రికులు పెద్ద మొత్తంలో చెత్తను వదిలివెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.









