Pan Masala :  పాన్‌ మసాలా తయారీదారులకు ఆహార భద్రత ప్రమాపాల సంస్థ గట్టి షాక్ ఇచ్చింది. ఇకపై పాన్‌ మసాలాను ప్యాకింగ్ చేయడానికి ప్లాస్టిక్‌ను వాడకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్తగా నిబంధనలను ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Also Read : రాజ్యసభలో లుంగీవాలా రచ్చ: దక్షిణాది ఎంపీల తీవ్ర నిరసన!

ఇప్పటివరకు పాన్‌ మసాలా ప్యాకెట్ల తయారీలో ప్లాస్టిక్ లేదా ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న కవర్లను ఎక్కువగా వాడుతున్నారు. కానీ, కొత్త నిబంధనల ప్రకారం ప్యాకింగ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్, మెటలైజ్డ్ పొరలు ఉండకూడదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తేల్చిచెప్పింది. పాలిథిలిన్, పాలీప్రొఫైలిన్, పీవీసీ లాంటి ఏ రకమైన సింథటిక్ పాలిమర్లు కూడా ప్యాకింగ్‌లో ఉపయోగించడానికి వీల్లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. పైకి పేపర్లా కనిపించినా, లోపల ప్లాస్టిక్ లేదా మెటల్ పొరలు ఉంటే అలాంటి ప్యాకింగ్‌లను కూడా పూర్తిగా నిషేధించారు.

ప్లాస్టిక్‌కు బదులుగా తయారీదారులు కేవలం సహజ సిద్ధమైన పదార్థాలనే వాడాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూచించింది. ఈ కొత్త నిబంధనలు అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తారీఖు నుంచే తక్షణమే అమల్లోకి వచ్చాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016 లోని కొన్ని నిబంధనలు కూడా ఈ పాన్‌ మసాలా ప్యాకింగ్‌కు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. అయితే, ఇది కేవలం ప్యాకింగ్‌కు సంబంధించిన మార్పు మాత్రమేనని, పాన్‌ మసాలా ఉత్పత్తులపై ఎలాంటి పూర్తి నిషేధం విధించలేదని స్పష్టంచేశారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ తుది నిర్ణయం తీసుకుంది.

Also Read : రేషన్ షాపుల దగ్గర క్యూ కట్టాల్సిన పనిలేదు… ఛలో రేషన్‌ ఏటీఎం… ఎక్కడో తెలుసా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.