India vs Afghanistan Test Match
India vs Afghanistan Test Match

India vs Afghanistan Test Match : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సుదీర్ఘ ఫార్మాట్ వినోదం మళ్లీ మొదలైంది. దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు శనివారం నుంచి తెలుపు దుస్తుల్లో బరిలోకి దిగుతోంది. చండీగఢ్‌లోని సరికొత్త స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌తో టీమ్‌ఇండియా సరికొత్త సీజన్‌ను ప్రారంభించనుంది. గతేడాది నవంబరులో దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్టు ఆడిన భారత్, ఆ తర్వాత ఐపీఎల్, టీ20ల హడావుడిలో మునిగితేలింది. ఇప్పుడు మళ్లీ సాంప్రదాయ టెస్టు క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమైంది. ఉదయం 9.30 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

FotoJet - 2026-06-06T081040.921

టెస్టు క్రికెట్‌లో పసికూనగా కనిపించే అఫ్గానిస్థాన్‌తో భారత్‌కు ఇది కేవలం రెండో టెస్టు మ్యాచ్. గతంలో 2018లో బెంగళూరులో జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 262 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే, ప్రస్తుత అఫ్గాన్ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా వారి మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద మైనస్ అయినప్పటికీ, టీ20ల్లో అగ్రశ్రేణి జట్లకు షాకులివ్వడం అఫ్గాన్‌కు అలవాటే. రహ్మనుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, కెప్టెన్ షాహిది వంటి టీ20 హీరోలతో కూడిన అఫ్గాన్ జట్టు, ఐదు రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ ఫార్మాట్ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, భారత జట్టు సరికొత్త రూపంలో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఆర్. అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత టెస్టు జట్టులో పెద్ద మార్పులు వచ్చాయి. ప్రస్తుత సిరీస్ నుండి స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు విశ్రాంతి ఇవ్వడంతో జట్టు భారం యువ ఆటగాళ్లపై పడింది. ఈ నేపథ్యంలో యువ సంచలనం శుభ్‌మన్‌ గిల్ నేతృత్వంలోని సరికొత్త టీమ్‌ఇండియా ప్రదర్శనపై అందరి దృష్టీ నిలిచింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) పాయింట్ల పట్టికలో వెనుకబడిన భారత్‌కు, రాబోయే సీజన్‌లో ప్రతి మ్యాచ్ అత్యంత కీలకం కానుంది.

ఈ మ్యాచ్‌లో భారత స్పిన్ విభాగానికి సరికొత్త పరీక్ష ఎదురుకానుంది. సొంతగడ్డపై అశ్విన్, జడేజా ఇద్దరూ లేకుండా భారత్ టెస్టు మ్యాచ్ ఆడుతుండటం గత 16 ఏళ్లలో (చివరగా 2010లో) ఇదే తొలిసారి. దీంతో చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఇప్పుడు స్పిన్ దళాన్ని ముందుండి నడిపించాల్సి ఉంటుంది. జడేజా స్థానంలో ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రాగా.. యువ స్పిన్నర్లు హర్ష్ దూబె లేదా మానవ్ సుతార్‌లలో ఒకరికి అరంగేట్రం చేసే అవకాశం దక్కవచ్చు. బుమ్రా లేకపోవడంతో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, కెప్టెన్ గిల్‌లపై భారీ ఇన్నింగ్స్ ఆడే బాధ్యత ఉంది.

ఈ మ్యాచ్ భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. అతడి కెరీర్‌లో ఇది 50వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. భారత క్రికెట్ చరిత్రలో వికెట్ కీపర్లుగా ఎంఎస్ ధోని (90), సయ్యద్ కిర్మాణి (88) మాత్రమే పంత్ కంటే ఎక్కువ టెస్టులు ఆడారు. ప్రమాదం తర్వాత కోలుకుని మళ్లీ టెస్టుల్లో పట్టు సాధిస్తున్న పంత్, తన మైలురాయి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో, భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం లేకుండానే భారీ స్కోరు సాధించాలని యోచిస్తోంది.

తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న చండీగఢ్‌ పిచ్ నల్లమట్టితో రూపొందించబడింది. ఇది ప్రారంభంలో బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించినప్పటికీ, మ్యాచ్ రోజులు గడిచేకొద్దీ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారే అవకాశం ఉంది. వాతావరణం విషయానికి వస్తే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఏమీ లేదని తెలుస్తోంది.

తుది జట్లు (అంచనా):
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్, ధ్రువ్‌ జురెల్, వాషింగ్టన్‌ సుందర్, హర్ష్‌ దూబె/మానవ్‌ సుతార్, కుల్‌దీప్‌ యాదవ్, మహ్మద్‌ సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ.
అఫ్గానిస్థాన్‌: సెదిఖుల్లా అటల్, రహ్మనుల్లా గుర్బాజ్, రహ్మత్‌ షా, హస్మతుల్లా షాహిది (కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రహ్మనుల్లా, అఫ్సర్‌ జజాయ్, షరాఫుద్దీన్‌ అష్రాఫ్, నంగేయాలియా కరోటే, ఖ్వాయిస్‌ అహ్మద్, జియావుర్‌ రెహ్మాన్‌.