NEET Paper Leak : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన నీట్ (NEET) పరీక్షాపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యావ్యవస్థలో ప్రక్షాళన డిమాండ్లతో దేశరాజధాని ఢిల్లీ వేదికగా రాజకీయ వాతావరణం అత్యంత వేడెక్కింది. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు, ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న సీజేపీ (CJP) ప్రతినిధి బృందానికి మధ్య జరిగిన కీలక భేటీ దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపింది.

ఈ అత్యున్నత స్థాయి చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా , పిఎంఓ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో చెలరేగిన తీవ్ర అసంతృప్తిని చల్లార్చడానికి, విద్యార్థుల వైపు నుంచి వస్తున్న ఒత్తిడికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం నేరుగా ఈ చర్చల ప్రక్రియను చేపట్టింది.

మరోవైపు సీజేపీ తరఫున సీనియర్ ప్రతినిధి సౌరభ్ దాస్, అశుతోష్ రాంకా,భిజీత్ దిప్కేలతో కూడిన బృందం ఈ భేటీకి హాజరైంది. బాధిత విద్యార్థుల ఆవేదనను, విద్యా వ్యవస్థలోని లోపాలను కేంద్ర మంత్రుల ముందు స్పష్టంగా ఉంచిన సీజేపీ, ప్రభుత్వం తీసుకునే అర్ధంతర నిర్ణయాలు లేదా తాత్కాలిక హామీలను తాము అంగీకరించబోమని ప్రారంభంలోనే స్పష్టం చేసింది.

ఈ సుదీర్ఘ చర్చల్లో సీజేపీ లేవనెత్తిన అత్యంత కీలకమైన డిమాండ్ – కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా! నీట్ పేపర్ లీకేజీకి , నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని, ఆయనను తొలగించడమే నిజమైన కఠిన చర్య అని సీజేపీ నేతలు గట్టిగా పట్టుబట్టారు.

గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో సీజేపీ బృందం కేంద్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర లిఖితపూర్వక ప్రతిపాదనను (Written Memorandum) అందజేసింది. ఇందులో ప్రధానంగా మూడు డిమాండ్లను స్పష్టం చేశారు:

Also Read : కార్పొరేట్ లీడర్ నుంచి మినిస్టర్ వరకు.. కేటీఆర్ హాఫ్ సెంచరీ పొలిటికల్ జర్నీ!

విద్యాశాఖ మంత్రి తక్షణ రాజీనామా

నీట్ అక్రమాలు, లీకేజీల వల్ల మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించడం

తమ భవిష్యత్తు కోసం ఆందోళనలు చేస్తున్న ఏ ఒక్క విద్యార్థిపైనా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయకూడదు.

సీజేపీ సమర్పించిన ప్రతిపాదనలపై స్పందించిన కేంద్రం, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిపై నమోదైన కేసులను ఎత్తివేసేందుకు, కొత్తగా ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాకుండా చూసేందుకు సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చింది. విద్యార్థులను క్రిమినల్ పరిధిలోకి తీసుకురావడం ప్రభుత్వ ఉద్దేశం కాదని మంత్రులు వివరణ ఇచ్చారు.

ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వెలువడింది. పరీక్షా పత్రాల లీకేజీలకు పాల్పడే దోషులకు దాదాపు పదేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే, కేవలం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు లేదా నూతన చట్టాల ప్రకటనలతో సరిపెట్టలేమని సీజేపీ తెగేసి చెప్పింది.

లీకేజీ వివాదాల వల్ల తీవ్ర ఒత్తిడికి లోనై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని సీజేపీ స్పష్టం చేసింది. ప్రతి బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ఆసరా కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల కష్టాలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై స్పందించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా, ఈ విషయాన్ని ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి ఉన్నత స్థాయి కేబినెట్‌కు తీసుకెళ్తామని తెలిపారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ సీజేపీ ప్రతినిధులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.

అయితే కేంద్రం ఇచ్చిన తాత్కాలిక హామీలతో సంతృప్తి చెందని సీజేపీ ప్రతినిధులు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అధికారిక ప్రకటన వచ్చే వరకు తమ నిరసనలు, పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. కేవలం చర్చలతో కాలయాపన చేయడం తగదని, ప్రధాని మోదీ తక్షణమే జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

సమావేశం ముగిసిన అనంతరం ఇరువర్గాలు కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ఉమ్మడి లేదా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ఈ భేటీ తదుపరి విద్యాశాఖ పరిణామాలపై ప్రభుత్వం తీసుకోబోయే అడుగులపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది.

మొత్తానికి, నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశంలో విద్యా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి పెద్ద రాజకీయ సవాలుగా మారింది. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందోనని దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : సిక్ లీవ్స్ ఇవ్వరు.. వాష్‌రూమ్ వెళ్లనివ్వరు.. టెక్ మహీంద్రాపై హైదరాబాద్ టెకీ ఆరోపణలు

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.