
CM Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పెదలకు సన్నం బియ్యం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు చేయలేదని, ఆ రెండు పార్టీలు ఒకే నాణేనికి బొమ్మాబొరుసుల్లాంటివని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కొత్తస్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం తెచ్చిపెట్టే వస్తువు మాత్రమే కాదని. ఇది ప్రజల ఆత్మగౌరవం. ఎక్కడికి వెళ్లినా ఆకలి తీర్చే కార్డని సీఎం అన్నారు. రేషన్ అనే వ్యవస్థను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకొని పేదలకు మేం సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు.
మా పథకాలపై చాలా మంది చాలారకాలుగా మాట్లాడుతున్నారని, మీరిచ్చిన దొడ్డు బియ్యం ఏనాడైనా పేదలు వండుకొని తిన్నారా? మేం ఇచ్చిన సన్న బియ్యం బర్రెలకు, కోళ్లకు దాణాగా వాడారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేము రేషన్లో సన్నబియ్యం ఇవ్వడంవల్లే మార్కెట్లో బియ్యం రేట్లు తగ్గాయన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది అన్నారు.. ఏనాడైనా పోయిందా?’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read : అద్దంకి దయాకర్ కు అరుదైన అవకాశం.. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో అడ్మిషన్!
వరి వేస్తే… ఉరి వేసుకున్నట్లే అని ఆనాడు కేసీఆర్ అన్నారని, ఆయన మాత్రం తన వందలాది ఎకరాల్లో వరి పండిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేము రైతులకు మేలు చేస్తుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుని విమర్శలు చేస్తున్నారని సంగారెడ్డి గడ్డా నుంచి సవాల్ విసురుతున్న కేసీఆర్.. రైతుల కోసం మేము చేసిన మేలు, మీరు చేసిన అన్యాయంపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి చాలెంజ్ చేశారు.అంతేకాదు రూ.500 బోనస్ ఇచ్చి మరీ వడ్లు మేం కొంటున్నాం. నేను రైతుబంధును బంద్ చేయలేదు. 37 నెలల్లో 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.36 వేల కోట్ల రైతుబంధు నిధులు జమ వేశాం అన్నారు. రెండుసార్లు సీఎం అయిన కేసీఆర్ రైతు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రైతు రుణమాఫీ చేసిందన్నారు. అప్పులు లేని రైతులు తెలంగాణలో ఉన్నారని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. 32 నెలల్లో వడ్లు కొని రూ.90 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని రేవంత్ అన్నారు. రైతులకు ఉచిత కరెంటు కోసం ఏడాదికి రూ.35 వేల కోట్లు చెల్లిస్తున్నామన్నారు. రైతుల కోసం ఇప్పటివరకు లక్షా 75వేల కోట్లు ఖర్చు చేశామన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ హయాంలో రైతు రాజు అయ్యాడన్నారు.
మీ తమ్ముడు రేవంత్ రెడ్డిని ఆశీర్వదించడానికి మేం ఇచ్చిన పాలపిట్ట చీర కట్టుకొని మీరంతా వచ్చారు. ఈసారి మహిళలకు సారె కింద చిలకపచ్చ చీరలు పంపిణీ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాం. ఉచిత బస్సు పథకానికి రూ.11 వేల కోట్లు ఆర్టీసీకి ఇచ్చాం. మా అక్కలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తుంటే ఆ ఛార్జీలు మీ తమ్ముడు కడుతున్నాడు’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : తెలంగాణలో కొత్త స్కీమ్.. ఒక్కొక్కరికీ రూ.1.50 లక్షలు.. కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు!









