Telangana :  లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాదాద్ సజ్జనార్‌ నుంచి ఎన్‌కౌంటర్ బెదిరింపులు ఉన్నాయంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసు కస్టడీలో జరిగిన ప్రవర్తన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు నాగేశ్వరరావు. కస్టడీలో తనను అమానుషంగా హింసించారని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు ఉదయ్ కన్నీరు పెట్టుకున్నారని లేఖలో వెల్లడించారు. అంతేకాకుండా, సీపీ సజ్జనార్ స్వయంగా విచారించి ఎన్‌కౌంటర్‌లో చంపేస్తామని బెదిరించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసిందని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసు విచారణను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు సీబీ-సీఐడీకి బదిలీ చేయాలని ఆయన తన లేఖలో డీజీపీని కోరారు. కస్టడీ వేధింపులపై ఆధారాలను భద్రపరచి సంబంధిత అధికారులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read : నిమ్స్‌లో పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు..ఎప్పటినుంచంటే….

Also Read : సమగ్ర సర్వే(సర్‌)తో హైదరాబాద్ లో 40లక్షల ఓట్లు రద్దు ?

బాధితురాలైన మహిళా ట్రైనీ ఐపీఎస్, ఉదయ్ కృష్ణారెడ్డిలు 2025లో ప్రేమలో ఉన్నారని నాగేశ్వరరావు తన లేఖలో తెలిపారు. ఆ తర్వాత ఆమె ఓ ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకుని కేడర్ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఆ ప్రక్రియ పరిశీలనలో ఉండగానే ఉదయ్‌తో సంబంధం ఇష్టం లేకుండా జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన ఆరోపించారు.

కాగా మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించారనే ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డిపై జూలైలో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయ్ జూన్ 23 నుంచి బాధితురాలిని అసభ్యకరమైన మెసేజ్‌లు, కామెంట్లతో వేధిస్తున్నాడు. జూలై 9న ఆమె గదిలోకి బలవంతంగా చొరబడి జుట్టు పట్టుకుని, మెడపై చాకు పెట్టి చంపేందుకు యత్నించాడని, ఆమె వ్యక్తిగత వీడియోలు రికార్డు చేసి భర్తకు పంపాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది.

దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై BNS యాక్ట్ , ఐటీ యాక్ట్ కింద లైంగిక వేధింపులు, తీవ్ర గాయాలు చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.