Konda Sushmita : తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు రోజురోజుకూ ముదురుతోంది. రోజు ఏదో ఒక నియోజకవర్గంలో పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే అధిష్ఠానం తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మందుల సామేల్‌, పోచారం శ్రీనివాస రెడ్డి, దానం నాగేందర్‌, చిన్నారెడ్డి తదితరులు అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేయగా తాజాగా కొండా సురేఖ వంతు వచ్చింది.  ఇటీవల ములుగు, పరకాలలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని  ఆశీర్వదించాలని, మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని అక్కడి ఓటర్లకు కోరారు. అయితే అప్పటికే సీఎం మీద అసంతృప్తితో ఉన్న మంత్రి కొండా సురేఖ అటు ములుగు, ఇటు పరకాల సభలోనూ పాల్గొనలేదు.  ఇదిలా ఉండగా పరకాల సీటును కొండా సురేఖ కుటుంబం చాలా కాలంగా ఆశీస్తోంది. ఆమె కూతురు సుస్మిత వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తోందని ఇప్పటికే ప్రచారం చేసుకున్నారు. అలాంటిది  సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వారికి రుచించడం లేదు.  ఈ క్రమంలో ఈ రోజు ఉదయం కొండా సుస్మిత ఇన్‌ స్టాల్‌ లో చేసిన పోస్ట్‌ వైరల్‌ గా మారింది.

Also Read : రాజీనామా చేసి మళ్లీ గెలవండి చూద్దాం…సీఎం రేవంత్‌ రెడ్డికి కొండా సుస్మిత సంచలన సవాల్

‘ప‌ర‌కాల‌కు కాబోయే ఎమ్మెల్యే కొండా సుష్మిత‌’.. అంటూ కొండా సురేఖ కుమార్తె సుస్మిత పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌ గా మారింది.  ఇన్‌స్టా స్టోరీలో ఆమె ఒక ఫొటోను షేర్ చేస్తూ దానిపై ‘UPcomming Paraka MLA Konda Sushmita Patel’ అనే టెక్స్ట్ పెట్టారు. ఇది స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. పరకాల సీటును ఆశిస్తున్న కొండా కుటుంబానికి షాకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఇది కౌంటర్ అంటూ చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉండగానే ఈ రోజు మంత్రి సురేఖ పుట్టినరోజు సందర్భంగా పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలంలో కొండా సుస్మిత కార్యకర్తల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు.ఈ సందర్భంగా ఆమె సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం లేపాయి. ప‌దేండ్లు సీఎంగా ఉంటాన‌ని రేవంత్‌ చెప్పుకోవడంపై ఆమె ఘాటుగా స్పందించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కూడా అలా చెప్పుకోలేదని పేర్కొన్నారు. కొడంగ‌ల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయావ్‌. ఆ విష‌యం మ‌రిచిపోవ‌ద్దని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్‌ పార్టీకి సీతాద‌యాక‌ర్ ఏమి చేశారని, ఆమె ఎక్కడి నుంచి వ‌చ్చిందని సుస్మిత  ప్రశ్నించారు. హైద‌రాబాద్ ఇండ్ల పంపిణీలో బీసీ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ ఫొటోను ఎందుకు పెట్టలేదని, బీసీలు అంటే అంత చుల‌క‌నా? అంటూ సుస్మిత రేవంత్‌ రెడ్డిని నిలదీశారు. బీసీల‌కు అన్యాయం జ‌రుగుతుంటే పీసీసీ అధ్యక్షుడు మ‌హేశ్‌కుమార్ గౌడ్ బీసీగా ఉండి ఏం చేస్తున్నారని,కొండా ముర‌ళీకి ఎందుకు ప‌ద‌వులు ఇవ్వడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Also Read : 22-A అంటే ఏమిటీ? పట్టా భూములకు తప్పని తిప్పలు..

అసలు తెలంగాణకు ‘పొంగులేటి ముఖ్యమంత్రా.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? అసలు ఎవరు సీఎం అనేది అర్థం కావడం లేదు’ అని సుష్మితా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.అచ్చ కాంగ్రెస్, ప‌చ్చ కాంగ్రెస్ అనేది బ‌య‌టపెట్టాలని సుస్మిత డిమాండ్‌ చేశారు. పరకాలలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, ప్రకాశ్ రెడ్డి కాని, మీ తాత కానీ వచ్చి ఇక్కడ పోటీ చేయండని రేవంత్ కు సవాల్ విసిరారు. గడిచిన మూడేళ్లలో వేంనరేందర్ రెడ్డి రేవంత్ కి ఇచ్చిన సలహాలేంటో తెలియజేయాలని కోరారు.

రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించిన అవినీతిపై ఇప్పటివరకు రూ.200 కోట్ల వ్యవహారాన్ని మాత్రమే బయటపెట్టానని సుష్మితా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కౌంటర్ ఇస్తే మరిన్ని విషయాలను బయటపెడతానని గట్టిగా హెచ్చరించారు. రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల సమయానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారో, ఉండరో కూడా సందేహమేనని సుష్మితా పటేల్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాగా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీయడంతో పాటు అధిష్టానం కొండా కుటుంబంపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.