
MLA Prakash Goud : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. MLA ప్రకాష్ గౌడ్పై ఆయన కొడుకు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి ప్రకాష్ గౌడ్ తనని చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన కామెంట్స్ చేశారు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మా నాన్నకు ఇష్టం లేదన్నారు. తనకు కాబోయే భార్య ఇంటిపై అనుచరులతో దాడి చేయించి, చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని వెల్లడించారు.
Also Read : పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలాన్ని ఒడిచిపట్టిన గళం “గద్దర్”
పోలీస్ స్టేషన్లో కానీ, కోర్టులో కానీ నాకు న్యాయం జరుగుతుందని నేను అనుకోవడం లేదు.
చావుకు తెగించి మీతో మాట్లాడుతున్నా… నన్ను ఎప్పుడైనా చంపేయొచ్చు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే (ప్రస్తుతం కాంగ్రెస్) ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్.
తాను ప్రేమించిన యువతిని వివాహం… pic.twitter.com/cVk9oXD3yK
— greatandhra (@greatandhranews) August 6, 2026
ఏ క్షణమైనా మమ్మల్ని చంపేస్తాడని, తనకు, తనకు కాబోయే భార్యకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. తమకు ఏమైనా అయితే పూర్తి బాధ్యత వారిదేనని సంతోష్ గౌడ్ చెప్పుకొచ్చారు. తాను ప్రేమించిన యువతి ఇంట్లో నెల రోజులుగా ఉంటున్నట్టుగా సంతోష్ వెల్లడించారు. తాను ప్రాణాలకు తెగించి మరి మీడియా ముందుకు వచ్చినట్లుగా తెలిపారు. తాను శ్రియశ్రీ అనే ఓ అమ్మాయిని తాను ఇష్టపడుతున్నానని మా ఇద్దరికి 2026 జులై 08వ తేదీన ఎంగేజ్మెంట్ కూడా జరిగిందన్నారు.
ఈ విషయం తమ తల్లిదండ్రులకు కూడా తెలుసునని, కానీ మా పెళ్లి చేయడం వారికి ఇష్టం లేదన్నారు. దీంతో మా అత్తమ్మ వాళ్ల ఇంట్లోనే వారి సమక్షంలోనే తమ ఎంగేజ్మెంట్ జరిగిందని వెల్లడించాడు సంతోష్. ప్రస్తుతం తాను అక్కడే వారితోనే ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఓ 40మంది వచ్చి తన అత్తగారింటిపై దాడి చేసినట్లుగా తెలిపాడు. తాను ప్రేమించిన అమ్మాయి తన తండ్రికి ఇష్టం లేదని, తన ప్రేమ వ్యవహారం కారణంగానే ఇలాంటి దాడులకు ప్రయత్నిస్తున్నారని సంతోష్ ఆరోపించారు.
తమకు ప్రాణాలకు ముప్పు ఉందని, తాము చనిపోతే వాళ్లదే బాధ్యత అని చెప్పారు. వారి కాల్డేటా వివరాలు మీడియాకు ఇస్తానని సంతోష్ గౌడ్ తెలిపారు. సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటన పట్ల ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పందించాల్సి ఉంది.
Also Read : డయల్ 100 రద్దు… ఎమర్జెన్సీ సర్వీసులకు డయల్ 112









