
IRAN : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన గల్ఫ్ దేశాలలోని ఆస్తులను తమ సైనిక దాడులకు సరైన లక్ష్యాలుగా పరిగణిస్తున్నామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ దేశాలలో ఉన్న ట్రంప్ బ్రాండెడ్ హోటళ్లు, టవర్లు, గోల్ఫ్ క్లబ్బులను ఇరాన్ మీడియా తన నివేదికల్లో పేర్కొంది.
Also Read : ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దు: అక్టోబర్ 27న ఎన్నికలు!
ఇరాన్ గుర్తించిన ప్రధాన ఆస్తులు:
- దుబాయ్: ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ & రెసిడెన్షియల్ టవర్, ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్.
- సౌదీ అరేబియా: జెడ్డాలోని ట్రంప్ ప్లాజా టవర్, రియాద్లోని ట్రంప్ టవర్, వాడి సఫార్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్.
- ఖతార్: ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ & విల్లాస్ సెమైస్మా.
- ఒమన్: మస్కట్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్.
ఈ ఆస్తులపై దాడులు ఎప్పుడు, ఎలా చేస్తారనే దానిపై స్పష్టత లేకపోయినా, టెహ్రాన్ , వాషింగ్టన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్లోని పౌర మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేస్తే, ఈ ప్రాంతం మొత్తంలో మరింత తీవ్రమైన ప్రతిదాడులు ఉంటాయని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరి హెచ్చరించారు.
ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ఇరాన్ పవర్ ప్లాంట్లు, వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో, అంతకంటే విధ్వంసకరమైన చర్యలు తీసుకుంటామని ఇరాన్ బదులిచ్చింది. వ్యూహాత్మకంగా కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలమార్గంలో అమెరికా జోక్యం చేసుకుంటే, అది తమ ‘రెడ్ లైన్’ దాటడమేనని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తగ్గించేందుకే దాడులు చేస్తున్నామని అమెరికా వాదిస్తుండగా, తమ మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే పశ్చిమ ఆసియాలోని మొత్తం ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాలపై ప్రతిచర్య ఉంటుందని ఇరాన్ ఖతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ హెచ్చరించింది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరమైన ఆందోళనలను పెంచుతున్నాయి.
Also Read : సింధు జలాల ఒప్పందం: భారత్ బిల్లు కడుతున్న పాకిస్థాన్ !









