POK : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో నిరసన జ్వాలలు రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. వరుసగా 17వ రోజు కూడా ఈ నిరసనలు ఉధృతంగా కొనసాగాయి. తాజాగా రావల్‌కోట్‌లోని ఈద్గా మైదానంలో సుమారు 50,000 మందికి పైగా ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత భారీ బహిరంగ ప్రదర్శనలలో ఇది ఒకటిగా నిలిచింది. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించినప్పటికీ, భద్రతా బలగాలను భారీగా మోహరించినప్పటికీ ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రోడ్లపైకి వస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, పరిపాలనా వైఫల్యాలు, దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read : అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు షాక్.. ఇకపై నాలుగేళ్లు మాత్రమే సమయం

ఈ ప్రజా ఉద్యమంలో మహిళా యాక్టివిస్టులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ ముందు వరుసలో నిలుస్తున్నారు. స్థానిక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రానీమా షజ్మా మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఆమె పాకిస్తాన్ అధికారులు, భద్రతా బలగాల క్రూరమైన వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. పాక్ సైన్యం ఇక్కడి సామాన్య పౌరులపై అక్రమ చర్యలకు పాల్పడుతోందని, ప్రజల కనీస అవసరాలను, ఆందోళనలను తీర్చడంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో POK రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె డిమాండ్ చేశారు. రావల్‌కోట్ సభలో అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడుతూ, కశ్మీర్‌కు సంబంధించిన నిర్ణయాలను కశ్మీర్ ప్రజలకే వదిలేయాలని, పాక్ ఇక్కడి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ నిరసనలపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పార్లమెంట్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నిరసనకారుల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ ప్రాంతం కోసం పాకిస్తాన్ ఎన్నో త్యాగాలు చేసిందని పేర్కొంటూ ఆయన నిరసనకారులను విమర్శించారు. అంతేకాకుండా, ఆందోళన చేస్తున్న వారి గుర్తింపుపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి, నిరసనకారుల ఆగ్రహానికి కారణమయ్యాయి. రక్షణ మంత్రి వ్యాఖ్యలు గాయాలపై కారం చల్లినట్లు మారడంతో, ఈ ఉద్యమం మరింత ఉధృతంగా మారి పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

ప్రజల నిరసనలను అణచివేసేందుకు పాక్ అధికారులు అత్యంత అమానవీయమైన చర్యలకు పాల్పడుతున్నట్లు ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. POK ప్రాంతానికి అవసరమైన నిత్యావసర వస్తువుల రవాణాను అధికారులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు. పాకిస్తాన్‌ను,POK ని కలిపే సరిహద్దు ఎంట్రీ పాయింట్ల వద్ద ఆహార పదార్థాలు, ఇతర అత్యవసర వస్తువులతో వెళ్తున్న ట్రక్కులను గత కొన్ని రోజులుగా నిలిపివేశారు. ఇప్పటికే సుదీర్ఘకాలంగా సాగుతున్న లాక్‌డౌన్ తరహా పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న స్థానిక ప్రజలను, ఈ సరుకుల కొరత ద్వారా మరింత మానసిక, ఆర్థిక ఒత్తిడికి గురిచేసి ఉద్యమాన్ని నీరుగార్చాలని పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్థానిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : అమెరికాకు చైనా బిగ్ షాక్.. నంబర్ 1 సూపర్‌ కంప్యూటర్‌గా చైనా లైన్‌షైన్!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.