
మిడిల్ ఈస్ట్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల అమెరికా చేపట్టిన సైనిక చర్యలకు ప్రతీకారంగా ఇరాన్ వరుస దాడులకు దిగింది. దీంతో మధ్యప్రాచ్య దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికా దాడులకు ప్రతీ దాడులుగా ఇరాన్ గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్, డ్రోన్ దాడులు ప్రారంభించింది. ముఖ్యంగా కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ ప్రాంతాల వైపు ఇరాన్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. జోర్డాన్ వైపు దూసుకొచ్చిన ఐదు మిస్సైళ్లను అక్కడి రక్షణ దళాలు విజయవంతంగా కూల్చివేసినట్లు సమాచారం.
పెద్ద నష్టం జరగకుండా..
ఈ దాడుల వల్ల పెద్ద నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఇరాన్ దాడుల తీవ్రతను చూసి జోర్డాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. ఇరాన్ ప్రధాన లక్ష్యాల్లో జోర్డాన్లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్బేస్ ఒకటిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్బేస్లో అమెరికా సైన్యానికి చెందిన ఆధునిక యుద్ధ విమానాలు మోహరించి ఉన్నాయి.
ముఖ్యంగా అమెరికా F-35 ఫైటర్ జెట్లకు ఇది కీలక స్థావరంగా భావిస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. అటు కువైట్, బహ్రెయిన్ దేశాలు కూడా ఇరాన్ నుంచి వచ్చిన మిస్సైళ్లు, డ్రోన్లను అడ్డుకున్నట్లు ప్రకటించాయి. ఈ ఘటనల నేపథ్యంలో బహ్రెయిన్తో పాటు పలు గల్ఫ్ దేశాలు హై అలర్ట్ ప్రకటించాయి. విమానాశ్రయాలు, సైనిక స్థావరాలు, కీలక ప్రభుత్వ భవనాల వద్ద భద్రతను పెంచారు.









