Ajay Sharma : బెంగాల్ ఎన్నికల్లో యూపీ సింగం : ఎవరీ అజయ్ పాల్ శర్మ? ఎందుకింత రచ్చ?

వెస్ట్ బెంగాల్(west bengal) ఎన్నికల వేళ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే భారీగా కేంద్ర బలగాలను మోహరించడంతో ఉత్కంఠ నెలకొనగా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సింగంగా పేరుగాంచిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ(Ajay Sharma) ఎంట్రీతో వివాదం ముదిరింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన సౌత్ 24 పరగణాలకు ఆయన్ను ఎన్నికల పరిశీలకుడిగా ఈసీ నియమించింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనుచరులను అజయ్ పాల్ హెచ్చరిస్తున్న వీడియో ఒకటి బయటకు రావడంతో టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.

అజయ్ పాల్ శర్మ 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. పంజాబ్‌లోని లూథియానాలో జన్మించిన ఆయనకు దబాంగ్ ఆఫీసర్‌గా పేరుంది. వాస్తవానికి ఆయన చదువులో చాలా చురుకు. ఐపీఎస్ కాకముందు ఆయన వృత్తిరీత్యా డెంటిస్ట్. తన తల్లిదండ్రుల ప్రోద్బలంతో 2008లో యూపీఎస్సీకి ప్రిపేర్ అయి, తన సోదరుడితో కలిసి సివిల్స్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన తమ్ముడు ఐఏఎస్ అధికారి కాగా, అజయ్ పాల్ ఐపీఎస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రయాగ్‌రాజ్‌లో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌లో నేరరహిత పాలన కోసం అజయ్ పాల్ ఎన్నో సాహసోపేతమైన ఆపరేషన్లు చేశారు. దాదాపు 9 మందిని ఎన్‌కౌంటర్ చేయడంతో పాటు 190 మందికి పైగా నేరస్తులను గాయపరిచినట్లు రికార్డులు చెబుతున్నాయి. అందుకే ఆయనకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అనే ముద్ర పడింది. 2018లో రాంపూర్‌లో ఒక చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని పట్టుకునే క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడికి మూడు బుల్లెట్లు తగిలాయి. ఈ ఘటనతో ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోయింది. కేవలం నేరస్తులే కాదు, సొంత శాఖలోని అవినీతిపరుల ఆట కట్టించడంలోనూ ఆయన ముందుంటారు. ఒకసారి ఆటోలో మారువేషంలో వెళ్లి మరీ లంచం తీసుకుంటున్న ఎస్ఐని పట్టుకుని సస్పెండ్ చేశారు.

అయితే, ఆయన కెరీర్‌లో వివాదాలు కూడా తక్కువేం లేవు. ఆయన చేసిన కొన్ని ఎన్‌కౌంటర్లు బూటకమని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. అలాగే, బదిలీల కోసం పైరవీలు చేశారని, క్యాష్-ఫర్-పోస్టింగ్ స్కామ్‌లో ఆయన ప్రమేయం ఉందని టీఎంసీ విమర్శలు చేస్తోంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక మహిళ పెట్టిన కేసు, సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోలు కూడా ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టాయి. అయినప్పటికీ ఆయనకు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇప్పుడు బెంగాల్ ఎన్నికల బరిలో ఆయన రాక కలకలం రేపింది. సౌత్ 24 పరగణాలు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి బలమైన కోట. అటువంటి చోట అజయ్ పాల్ శర్మ తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఫాల్టా నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనుచరులు ఓటర్లను బెదిరిస్తున్నారని ఫిర్యాదు రావడంతో, ఆయన నేరుగా రంగంలోకి దిగారు. జహంగీర్ అనుచరులను గట్టిగా హెచ్చరిస్తూ, చట్టం ప్రకారం ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి, అప్పుడు ఏడవకండని అనడం వీడియోల్లో రికార్డ్ అయ్యింది.