
Vietnam Flight : ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణాలు తీవ్రంగా బయటపెడుతున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన ఘటనలు మరువకముందే వియత్నాం ఎయిర్ లైన్స్లో ఒకేసారి పలు టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో రెండు గంటల పాటు ఫ్లైట్ గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు.ఈ ఘటన జర్మనీలోని మ్యూనిచ్ విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, వియత్నాం ఎయిర్లైన్స్కు చెందిన ఈ విమానం మ్యూనిచ్ నుంచి వియత్నాంలోని హనోయి సిటీకి బయలుదేరాల్సి ఉంది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానం రెండుసార్లు స్పీడ్ తగ్గింది. తర్వాత వెనుక భాగం బలంగా నేలను తాకి టేకాఫ్ తీసుకుంది. దీంతో వెనుకవైపు నాలుగు ప్రధాన ల్యాండింగ్ గేర్ టైర్లు పేలిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Also Read : మధ్య ఆఫ్రికా రిపబ్లిక్లో కూలిన బంగారు గని…. 30 మంది మృతి
టైర్లు పేలిపోవడంతో ఆ సమయంలో విమానాన్న ల్యాండ్ చేస్తే ప్రమాదం సంభవించే అవకాశం ఉందని బావించిన పైలట్లు అప్రమత్తమయ్యారు. అనంతరం విమానంలోని ఇంధనాన్ని ఖాళీ చేయడానికి గాల్లో రెండు గంటల పాటు చక్కర్లు కొట్టారు. ఇంధనం ఖాళీ అయిన తర్వాత సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ల్యాండ్ చేసే సమయంలోనూ నేలకు రాసుకుపోయిన టైర్లుపేలాయి. దీంతో టైర్లు నేలకు రాసుకుపోవడంతో విమానం రన్వేపైనే ఆగిపోయింది. దీంతో రన్వేను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. ఈ ఘటన సమయంలో విమానంలో 271 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే ప్రయాణికులను సురక్షితంగా దించేసి, మరో విమానంలో వారి గమ్యస్థానాలకు చేర్చారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వియత్నం ఎయిర్లైన్స్ వెల్లడించింది.
Also Read : ఇరాన్ సైనిక వ్యూహం మార్పు… రక్షణ నుంచి ఆక్రమణ వైపు అడుగులు









