
Iran : సుదీర్ఘకాలంగా అమెరికాతో సాగిస్తున్న యుద్ధంలో తమ విజయాన్ని ప్రపంచం గుర్తించిందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇప్పటికైన అమెరికా ఓటమిని అంగీకరించి ఇక యుద్ధం ముగించాలని ఆయన కోరినట్లు పెజెష్కియాన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇరాన్ మీడియా కథనాలను ప్రసారం చేయడం సంచలనంగా మారింది. హర్మూజ్పై సుదీర్ఘ కాలంగా నియంత్రణ కలిగి ఉండటంతో పాటు అమెరికా షరతులకు అంగీకరించకపోవడాన్ని ఇరాన్ తన విజయంగా భావిస్తోందని మీడియా పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇరాన్ను తమతో ఒప్పందానికి రావాలని కోరుతున్నప్పటికీ.. తాము కోరుకుంటున్న షరతులకు ఆ దేశం ఇంకా అంగీకరించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్ధం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందని, దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని ట్రంప్ తెలిపారు. హర్మూజ్ జల సంధి ప్రాంతంతోపాటు సరిహద్దులవద్ద పూర్తి నియంత్రణ అమెరికా చేతుల్లోనే ఉందని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
Also Read : చెన్నైలో దారుణం… మహిళను చంపి శరీరభాగాలతో బిర్యానీ..
అమెరికా వల్లే అణ్వాయుధాల పోటీ
కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి మూలంగానే ప్రపంచంలో మరోసారి అణ్వాయుధాల పోటీకి దారితీసిందని కూడా ఇరాన్ ఆరోపించింది. అమెరికా చేపట్టిన సైనిక చర్యలు ప్రపంచ అణు భద్రతను తీవ్రంగా దెబ్బతీశాయని ఇరాన్ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి మొహసెన్ రెజాయ్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ చర్యలు ఇతర దేశాల్లోనూ భద్రతాపరమైన ఆందోళనలు పెంచుతున్నాయని ఆయన ఆరోపించారు. అమెరికా వైఖరి వల్ల అణ్వాయుధాలు లేని దేశాలు తమ రక్షణ కోసం వాటిని సమకూర్చుకోవాలన్న ఆలోచనకు అమెరికా విధానాలు ఊతమిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాల వ్యాప్తి ప్రమాదం పెరుగుతోందని మొహసెన్ రెజాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
అదే సమయంలో అమెరికా ఒత్తిళ్లకు ఇరాన్ తలొగ్గబోదని రెజాయ్ తేల్చి చెప్పారు. ఇరాన్పై చర్యలకు అమెరికాకు సహకరించే పొరుగు దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ట్రంప్ మరోసారి సైనిక చర్యకు దిగితే ఇరాన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందని కూడా హెచ్చిరించాడు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలను పునరుద్ధరించేందుకు ఈజిప్ట్ మరోసారి ప్రయత్నాలు ప్రయత్నాలు ప్రారంభంచింది. దీనికోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో ఈజిప్ట్ అధికారులు సంప్రదింపులు మొదలు పెట్టారు. యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు సాగుతున్నట్లు ఆ దేశం వెల్లడించింది.
Also Read : గణేశ్ ఉత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం.. ఇద్దరు మృతి!









