
BIG BREAKING : రాజమండ్రిలో ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా వెల్లడించారు. మధ్యాహ్నం 3:22 గంటలకు ఆమె మృతి చెందినట్లుగా ప్రకటించారు. ప్రియాంక మరణవార్త వినగానే ఆమె తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా మద్యం మత్తులో ఇద్దరు నిందితులు బైకుపైన వెళ్తున్న ప్రియాంకను కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆమెతో పాటుగా మరో యువకుడు కూడా తీవ్రంగా గాయపడగా అతను చికిత్స పొందుతున్నాడు.
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాస్పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక, ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్లో స్థిరపడ్డారు.
ఈ నెల 3వ తేదీ రాత్రి ప్రియాంక తన ఫ్రెండ్ ఉమేష్తో కలిసి రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూసి బైకుపై బయలుదేరారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న కొందరు ఆకతాయిలు నడిపిస్తున్న కారు వీరి బైకునుల అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలు కాగా, మెరుగైన వైద్యం కోసం ఆమెను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆమె పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ వేగవంతం చేశారు.









