
Supreme Court : దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో శుక్రవారం తీవ్ర కలకలం రేగింది. ఒక కేసు విచారణ సందర్భంగా కోర్టు హాల్లోకి ప్రవేశించిన ఒక పిటిషనర్ అత్యంత అనాగరికంగా ప్రవర్తించి, న్యాయమూర్తులపైనే తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరుగుతుండగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్వయంగా కోర్టుకు హాజరైన సదరు ఫిర్యాదుదారుడు ఒక్కసారిగా న్యాయపీఠం (బెంచ్) వైపు కాగితాలను విసిరేసి, అసభ్య పదజాలంతో దూషించడంతో కోర్టు హాలులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
న్యాయమూర్తులు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టిన సమయంలో ఈ ఘోర పరిణామం జరిగింది. వాదనలు వినిపించేందుకు నిలబడిన సదరు పిటిషనర్, ప్రారంభంలోనే చట్ట నిబంధనలను పక్కనబెట్టి అత్యంత దూకుడుగా, అసాధారణ స్వరంతో మాట్లాడాడు. న్యాయమూర్తులను ఉద్దేశించి.. “మిస్టర్ జ్యుడీషియల్ సర్వెంట్ (న్యాయ సేవకుడా).. లక్నో ఏసీపీపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అంటూ అహంకారపూరితంగా వ్యాఖ్యానించాడు.
కలలో కూడా ఊహించని ఈ వ్యాఖ్యలకు న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పిటిషనర్ ప్రవర్తనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. “నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నావా? న్యాయస్థానానికే ఆర్డర్ వేస్తున్నావా?” అని సదరు వ్యక్తిని ప్రశ్నించారు. అయితే, ఆ ప్రశ్నకు ఏమాత్రం పశ్చాత్తాపం పడకుండా, అంతే ఉద్ధృతంగా స్పందించిన ఆ పిటిషనర్.. “నా తరఫున చెప్పాల్సిందంతా చెప్పేశాను, అన్నీ రికార్డుల్లోనే ఉన్నాయి” అంటూ కోర్టు రూమ్లోనే దురుసుగా సమాధానమిచ్చాడు.
Also Read : భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త జవసత్వాలు.. దేశ విదేశీ మారక నిల్వల్లొ భారీ వృద్ధి
ఆ తర్వాత వివాదం మరింత ముదిరి శ్రుతిమించింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న కేసు పత్రాల కట్టను ఒక్కసారిగా గాల్లోకి విసిరేస్తూ న్యాయమూర్తుల డయాస్ వైపు విసిరాడు. అంతటితో ఆగకుండా, కోర్టు హాలులోనే అత్యంత అసభ్య పదజాలంతో బూతులు తిట్టడం ప్రారంభించాడు. ‘లైవ్ లా’ కథనం ప్రకారం.. ఆ సమయంలో సదరు బెంచ్లో భాగస్వామిగా లేని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్) సూర్యకాంత్ను సైతం ఉద్దేశించి అతను తీవ్ర దూషణలకు దిగడం అక్కడ ఉన్నవారందరినీ షాక్కు గురిచేసింది.
కోర్టు హాల్లో పరిణామాలు గతి తప్పుతుండటంతో అక్కడే విధుల్లో ఉన్న సుప్రీంకోర్టు భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. రెచ్చిపోతున్న పిటిషనర్ను భద్రతా సిబ్బంది వెనువెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతను కోర్టు హాల్ వదిలి వెళ్ళడానికి నిరాకరించినప్పటికీ, బలవంతంగా అతనిని పట్టుకుని కోర్టు రూమ్ నుండి బయటకు నెట్టివేసి, వెలుపలికి తరలించారు. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించడంతో కోర్టు హాల్లో శాంతిభద్రతలు మళ్లీ అదుపులోకి వచ్చాయి.
ఈ మొత్తం ఘోర ఉదంతం కళ్లముందే జరిగినా, న్యాయపీఠంపై ఉన్న జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలు ఏమాత్రం సహనం కోల్పోకుండా, అత్యంత సంయమనంతో వ్యవహరించడం విశేషం. పిటిషనర్ చేసిన దౌర్జన్యపూరిత ప్రవర్తనకు వారు ఎలాంటి ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఉండిపోయారు. అనంతరం ఎలాంటి ఆటంకం లేకుండా మిగతా కేసుల విచారణను యథావిధిగా కొనసాగించారు. కాగా, కోర్టు ధిక్కారానికి పాల్పడిన ఆ ఫిర్యాదుదారుడి పూర్తి వివరాలు, అతనిపై తీసుకోబోయే కఠిన చట్టపరమైన తదుపరి చర్యల సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read : ఒక్క సెకనులో సినిమా డౌన్లోడ్.. త్వరలో దేశంలోకి 6జీ.. ఎప్పటి నుంచంటే?









