PM Kisan : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి  పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ శుక్రవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం పొడిగింపు కోసం మొత్తం రూ. 3,15,614 కోట్ల భారీ ఆర్థిక వ్యయాన్ని కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ప్రతి ఏటా రూ. 6,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే డీబీటీ విధానం ద్వారా సమానంగా మూడు విడతలలో, ప్రతి విడతకు రూ. 2,000 చొప్పున జమ చేస్తారు.

Also Read : BJP జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా.. ఇంతకు ఏమైందంటే?

ఈ ఆర్థిక సహాయం పంటల సీజన్‌కు అనుగుణంగా అందజేయబడుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనివల్ల రైతులు ప్రతి సాగు కాలం ప్రారంభంలోనే ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయడానికి వీలవుతుందని చెప్పారు. ఖరీఫ్ విత్తనాలు వేసే సమయం, ఖరీఫ్ కోతలు, రబీ సీజన్ తయారీ, ఆయా కాలాల్లోని వ్యవసాయ పనులకు అయ్యే ఖర్చులను ఎదుర్కొనేందుకు ఈ ఆర్థిక భరోసా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

నిధులను సరైన సమయంలో బదిలీ చేయడం ద్వారా రైతులకు అత్యవసర సమయాల్లో పని మూలధనం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. దీనివల్ల రైతులు అనధికారిక వడ్డీ వ్యాపారులపై ఆధారపడటం తగ్గుతుందని, కాలానుగుణంగా వచ్చే వ్యవసాయ ఖర్చులను మెరుగ్గా నిర్వహించుకోగలుగుతారని ప్రభుత్వం పేర్కొంది.

రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి, ప్రత్యక్ష నగదు బదిలీల ద్వారా వారికి నిరంతరం ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పీఎం-కిసాన్ పథకం కొనసాగింపు మరోసారి స్పష్టం చేస్తోందని కేంద్రం వెల్లడించింది.

Also Read : మైక్రోసాఫ్ట్‌ సరికొత్త చరిత్ర.. ఒక్కరోజే రూ.42 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్ విలువ

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.