ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీ ప్రాంతాన్ని భారీ వరదనీరు ముంచెత్తింది. వరద ధాటికి ఇనుప వంతెన క్షణాల్లో కొట్టుకుపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో  వైరల్‌గా మారాయి. రాష్ట్రంలో  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీ ప్రాంతాన్ని ఈరోజు (సోమవారం) వరదనీరు ముంచెత్తింది. వరద తీవ్రంగా రావడంతో   ఓ ఐరన్‌ వంతెన క్షణాల్లో కొట్టుకుపోయింది..

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీతి వ్యాలీ ప్రాంతంలో ఉన్న నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. నది నీటిమట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాల వైపు ఆ వరదనీరు దూసుకొచ్చింది. నీటితో పాటు మట్టి, బురద, పెద్దపెద్ద బండరాళ్లు వరదల్లో కొట్టుకువచ్చాయి. ఈ క్రమంలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగి బలంగా ఢీకొట్టడంతో ఓ ఇనుప వంతెన నీటిలో కొట్టుకుపోయింది. వంతెనకు ఓ వైపున ఉన్న పలు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి.. మరోవైపు ఉన్న ఓ ట్రక్కు, ఎస్‌యూవీ వాహనాదారులు ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమయ్యారు. వెంటనే తేరుకుని అక్కడే ఉన్న ఎత్తైన ప్రాంతానికి చేరుకుని ప్రాణాలను దక్కించుకున్నారు. ఈ ప్రకృతి వైపరిత్యాన్ని అక్కడే ఉన్న కొంత మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో  నిమిషాల వ్యవధిలోనే అవి వైరల్‌గా మారాయి.

కాగా, వంతెన కొట్టుకుపోవడంతో నీతి వ్యాలీలోని ప్రాంతాలకు ప్రధాన పట్టణంతో ఉన్న రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పరిస్థితులు చక్కబడే వరకు ఈ ప్రాంతంలో ఎవరూ ప్రయాణాలు చేయొద్దని అధికారులు స్థానికులకు సూచించారు. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో నది నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఉత్తరాఖండ్‌లో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ, పునరావాస శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ వివరించారు. డెహ్రాడూన్, బాగేశ్వర్, నైనిటాల్, చంపావత్ జిల్లాల్లో వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో రహదారులు దెబ్బతినడం, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ఆయన వివరించారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.