Hizbul chief, Al-Badr supremo Top terrorists attend Pulwama mastermind's funeral
Hizbul chief, Al-Badr supremo Top terrorists attend Pulwama mastermind's funeral

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, వాంటెడ్ టెర్రరిస్ట్ అర్జున్ మంద్ గుల్జార్ అలియాస్ హమ్జా బుర్హాన్‌ను POKలో గుర్తుతెలియని దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. అతడి అంత్యక్రియల ప్రార్థనలకు పలు ప్రధాన ఉగ్రవాద సంస్థలకు చెందిన అగ్ర కమాండర్లు, కీలక ఉగ్రవాదులు బహిరంగంగా హాజరయ్యారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో హమ్జాను ఖననం చేశారు. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ అధిపతి సయ్యద్ సలాహుద్దీన్ సైతం అతని అంత్యక్రియలకు హాజరయ్యారు.

Also Read: ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్.. ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్..

అలాగే ప్రధాన ఉగ్రవాద సంస్థ అల్-బదర్ అగ్ర కమాండర్, చీఫ్ అయిన బఖ్త్ జమీన్ ఖాన్ కూడా హమ్జాకు తుది వీడ్కోలు పలికేందుకు వచ్చారు. హమ్జా అంత్యక్రియలు జరిగే సమయంలో భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అల్-బదర్ ఉగ్రవాద సంస్థ అధిపతి బఖ్త్ జమీన్ ఖాన్‌కు రక్షణగా డజన్ల కొద్దీ ఉగ్రవాదులు వచ్చారు. వీళ్లందరూ కూడా ఏకే-47లు పట్టుకొని జమీన్ ఖాన్‌ను చుట్టుముట్టి కాపలా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

హమ్జా బుర్హాన్ పాక్ గూఢచార సంస్థ ISIకి చాలా సన్నిహితుడిగా ఉండేవాడు. కల్నల్ రిజ్వాన్ అనే ఐఎస్ఐ అధికారి అతడికి వీఐపీ భద్రతను అందిస్తూ, ప్రధాన హ్యాండ్లర్‌గా వ్యవహరించాడు. హమ్జా తన మొత్తం నెట్‌వర్క్‌ను ముజఫరాబాద్‌లోని “మ్యాచ్ ఫ్యాక్టరీ” అనే పారిశ్రామిక సముదాయం నుంచి నడిపించాడు. హమ్జా మాజీ అల్-బరాక్ కమాండర్ ఫరూఖ్ ఖురేషీతో కలిసి కశ్మీర్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ దందా, ఆయుధాల సరఫరా దందాను నడుపించేవాడు. అయితే హమ్జా అంత్యక్రియలు పాక్ ఉగ్రవాదులు హాజరుకావడంతో ఆ దేశంలో ఉగ్రవాదులు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో తెలుస్తోందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.