Kim Government: ఎక్కడైనా ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్యమైన సూచనలు చేస్తుంది. కానీ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన దేశంలో విచిత్రమైన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉత్తర కొరియాలో తీవ్రమైన వేసవి ఎండలు, వడగాలులు వీస్తున్నాయి. ఆ వేడి తీవ్రత, వడదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి, శరీరానికి శక్తినిచ్చే ‘కుక్క మాంసం సూప్’ తాగాలని ప్రజలకు అక్కడి ప్రభుత్వం సూచనలు చేసింది. వేసవి ఎండల వల్ల డిహైడ్రేషన్ బారిన పడి గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, థైరాయిడ్ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని అక్కడి వైద్యులు తెలిపారు.

Also Read : ఉక్రెయిన్ వీధుల్లో రష్యన్ డ్రోన్ హంటింగ్.. వ్యాపారిని వెంటాడిన డ్రోన్లు.. ఎలా ఎటాక్ చేస్తాయంటే?

ఈ క్రమంలో శరీరాన్ని కూల్ చేసేందుకు పుచ్చకాయలు, పెసలు, దోసకాయలు తినాలని చెప్పడంతో పాటు బాడీకి తక్షణ బలాన్ని ఇవ్వడానికి కుక్క మాంసంతో చేసిన సూప్, చేపల గంజి, బీన్స్ గంజి తీసుకోవాలని సూచించారు. ఉత్తర కొరియా స్థానిక సంస్కృతిలో కుక్క మాంసాన్ని “డాంగోగి” అని పిలుస్తారు. దీనికి అక్కడ “తీపి మాంసం” అనే అర్థం ఉంది. ప్రపంచంలో కుక్క మాంసం తినడంపై ఎలాంటి చట్టపరమైన నిషేధం లేని కొన్ని దేశాల్లో ఉత్తర కొరియా కూడా ఒకటి. అక్కడ కుక్క మాంసం వంటకాలను ఒక సాంప్రదాయ ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు.

ముఖ్యంగా వేసవి వేడిని తగ్గించి, శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో ఈ సూప్ అద్భుతంగా పనిచేస్తుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అయితే 2020లో ప్యాంగ్యాంగ్ నగరంలో ఏకంగా “జాతీయ కుక్క మాంసం వంటల పోటీ”ని కూడా ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. అయితే ఈ సూప్ తాగమని వైద్యులు, ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ సూప్‌ను సాధారణ ఉత్తర కొరియా ప్రజలు కొనుగోలు చేయలేరు. ఎందుకంటే ఈ ఉత్తర కొరియా మార్కెట్‌లో కుక్క మాంసం చాలా ఖరీదైనది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పేదరికంతో అల్లాడుతున్న సామాన్య ప్రజలకు ఈ ‘డాంగోగి సూప్’ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ సూప్‌ను డబ్బు ఉన్నవారు మాత్రమే తీసుకోగలరని తెలుస్తోంది.

Also Read : హెచ్-1బీ వీసా పై అమెరికా మరో షాక్‌… రెన్యువల్‌పైనా అదనపు ఫీజులు..?