Social Media :  సామాజిక మాధ్యమాలు (Social Media) పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతున్నాయనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడానికి కనీస వయస్సు పరిమితిని 15 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ గురువారం ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తరహా కఠినమైన నిబంధనలను చట్టబద్ధం చేసిన మొట్టమొదటి అరబ్ దేశంగా యూఏఈ చరిత్రకెక్కింది.
కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. 15 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు సామాజిక మాధ్యమాల్లో తమ పేరుతో వ్యక్తిగత ఖాతాలను (Personal Accounts) సృష్టించుకోవడానికి వీల్లేదు. అలాగే వాటిలో పోస్టులు పెట్టడం, కామెంట్లు చేయడం, గ్రూపుల్లో చేరడం లేదా ఇతర వ్యక్తులతో సంభాషించడం వంటి కార్యకలాపాలపై పూర్తిగా నిషేధం ఉంటుంది. దీంతో పాటు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోని కొన్ని ప్రత్యేక ఫీచర్లను వీరు యాక్సెస్ చేయకుండా ఆంక్షలు విధించనున్నారు. చిన్నారుల స్క్రీన్ టైమ్, యాప్ వినియోగ సమయంపై పరిమితులు విధిస్తూ వయసుకు తగిన కంటెంట్‌ను మాత్రమే అనుమతించేలా వడపోత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
ఈ కొత్త చట్టం యూఏఈ పరిధిలో సేవలు అందిస్తున్న అన్ని అంతర్జాతీయ, స్థానిక సోషల్ మీడియా సంస్థలకు వర్తిస్తుంది. ఇకపై వినియోగదారులు కేవలం తాము ఎంటర్ చేసే వయసును మాత్రమే ప్రామాణికంగా తీసుకోకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అకౌంట్ ఓపెన్ చేసే వారి వయసును ఖచ్చితంగా నిర్ధారించడానికి అధికారిక డిజిటల్ ఐడీలను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత అధునాతన ధ్రువీకరణ వ్యవస్థలను తప్పనిసరిగా ఉపయోగించాలని ఆదేశించింది. ఈ మార్పులను తమ ప్లాట్‌ఫామ్‌లలో విజయవంతంగా అమలు చేయడానికి సోషల్ మీడియా కంపెనీలకు ప్రభుత్వం 12 నెలల గడువును ఇచ్చింది.
గణాంకాల ప్రకారం, యూఏఈలో పిల్లలు సగటున రోజుకు దాదాపు 3 గంటల సమయాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతున్నారని తేలింది. పిల్లలను ఆన్‌లైన్ వేధింపులు, ఇతర డిజిటల్ ప్రమాదాల నుండి రక్షించి, వారికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని యూఏఈ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, చిన్నారుల సోషల్ మీడియా నియంత్రణపై చట్టం తెచ్చిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలవగా, ఆ తర్వాత బ్రిటన్ (UK), మలేసియా వంటి దేశాలు కూడా ఇటువంటి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో యూఏఈ కూడా చేరడంతో మిగిలిన దేశాలు కూడా ఈ దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.