Russia War : రష్యా-ఉక్రెయిన్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. రెండు దేశాల మధ్య సాగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యాకు భారీ నష్టం వాటిల్లింది. ఈసారి ఒకేసారి అత్యధిక ప్రాణ నష్టం సంభవించింది. రష్యాపై తాజాగా ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఏకంగా 12 మంది మరణించారు. మరో 39 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. సెంట్రల్ రష్యా, టాటార్‌స్తాన్ పరిధిలోని నినేకామ్స్క్‌ పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసింది దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నినేకామ్స్క్‌ పట్టణం ఉక్రెయిన్ సరిహద్దుకు దాదాపు 1,000 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్నప్పటికీ ఉక్రెయిన్‌ దాడి చేయడం గమనార్హం.

Also Read : భారత్, అమెరికా సంబంధాల్లో మరో టెన్షన్…ఇండియాపై 100 శాతం టారిఫ్ ?

కాగా, ఈ పట్టణం అధిక సహజ, చమురు వనరులు కలిగి ఉన్న ప్రాంతం. ఇక్కడ అధిక సంఖ్యలో చమురు రిఫైనరీలు ఉన్నాయి. ఈ దాడికి సంబంధించి పలు వీడియోలు కూడా అక్కడి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఒక పారిశ్రామిక ప్రాంతంలో పేలుడు జరిగి, భారీగా పొగ వెలువడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దాడికి ప్రతికారంగా రష్యా కూడా ప్రతిదాడికి దిగింది. ఉక్రెయిన్ లోని ఖార్ఖివ్ ప్రాంతంపై రష్యా జరిపిన దాడిలో నలుగురు పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. చుగివ్ జిల్లాలోని, బుగైవిక గ్రామంపై సోమవారం రష్యా జరిపిన దాడిలో భారీ ప్రాణనష్టం సంభవించిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయని వివరించారు.

మరోవైపు ఉక్రెయిన్‌కు చెందిన 456 డ్రోన్లను ఆదివారం రాత్రి తాము కూల్చివేశామని రష్యా అధికారులు పేర్కొనడం గమనార్హం. దీంతో రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడికి దిగిందన్నారు. మరణించిన వారిలో ఒక మహిళ కూడా ఉందని అధికారులు తెలిపారు. గడచిన నాలుగేళ్లుగా ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇరుదేశాలకు చెందిన సైనికులతోపాటు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నా యుద్ధం మాత్రం ముగియడం లేదు.

Also Read : సీటు బెల్టు పెట్టుకోనన్న చిన్నారి…విమాన సర్వీస్‌ను రద్దు చేసిన సిబ్బంది

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.