
Samsung Layoffs : భారత్లో శాంసంగ్ ఉద్యోగులకు బిగ్ షాక్ తగిలింది. పెరిగిన మెమరీ చిప్ ధరలు, తగ్గుతున్న వినియోగదారుల డిమాండ్, కంపెనీ చేపడుతున్న మార్పుల కారణంగా శాంసంగ్ ఇండియా ఉద్యోగాల సంఖ్యను తగ్గిస్తోంది. ఇప్పటివరకు సుమారు 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్లను ఉద్యోగాల నుంచి తప్పించనుంది.
ఈ ఉద్యోగాల కోత ఒకేసారి కాకుండా దశలవారీగా జరుగుతోంది. హెడ్ ఆఫీస్లో డైరెక్టర్ స్థాయి అధికారులు, టీమ్ లీడర్లతో పాటు బ్రాంచ్, ఏరియా మేనేజర్లపైనా ప్రభావం పడుతోంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ కొంతమందికి ఉద్యోగం నుంచి తొలగింపు లేఖలు ఇస్తున్నట్లు సమాచారం.
Also Read : బుక్మైషోలో మోదీ ఈవెంట్కు ఫుల్ డిమాండ్.. గంటలోనే సీట్లు ఖాళీ!
ప్రస్తుతం ఉద్యోగాల కోత ప్రధానంగా టీవీలు, హోమ్ అప్లయన్సెస్ విభాగాల్లో జరుగుతోంది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలోని సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగుల్లో 25 శాతం వరకు ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీలో నేరుగా పనిచేసేవారితో పాటు ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న సిబ్బందిపైనా ప్రభావం ఉండొచ్చని సమాచారం.
శాంసంగ్పై ఒకేసారి అనేక వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా మెమరీ చిప్ ధరలు రెండింతలకు పైగా పెరిగాయి. మరోవైపు రూపాయి విలువ దాదాపు 10 శాతం పడిపోవడంతో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ ఖర్చు పెరిగింది. ముడి సరుకుల ధరలు కూడా పెరగడంతో కంపెనీ లాభాలపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుత ఉద్యోగాల కోతలో శాంసంగ్ స్మార్ట్ఫోన్ విభాగాన్ని మాత్రం పక్కన పెట్టినట్లు సమాచారం. భారత్లో కంపెనీకి మొబైల్ ఫోన్ వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరు కావడమే దీనికి కారణం. రాబోయే దీపావళి సీజన్లో ఫోన్ల అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ ఆశిస్తోంది.
ఇప్పుడే జరిగిన ఉద్యోగాల కోతతో పరిస్థితి ఆగిపోవచ్చని చెప్పలేం. దీపావళి తర్వాత మరోసారి ఉద్యోగాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా టీవీలు, హోమ్ అప్లయన్సెస్ విభాగాల్లో మరిన్ని మార్పులు ఉండొచ్చని సమాచారం.
Also Read : 12 వేల ఉద్యోగాలు.. 250 కొత్త బ్రాంచ్లు.. SBI భారీ ప్లాన్









