
PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. తమ ప్రాథమిక హక్కుల సాధన కోసం, పాక్ ప్రభుత్వ అణచివేత ధోరణికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రావల్కోట్లోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు, రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఆరుగురు సాధారణ పౌరులు మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో జాహిద్ ముఘల్, జఫర్ ముఘల్, అర్సలాన్ అక్బర్, వజీద్ హయత్ ఉన్నట్లు గుర్తించారు.
ఈ హింసాత్మక ఘటనలతో పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీపై పీఓకే ప్రజల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనలను అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం అక్కడి ప్రాంతంలో సుదీర్ఘకాలంగా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. డిజిటల్ దిగ్బంధం కారణంగా దాదాపు 40 లక్షల మంది ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం, మందులు వంటి నిత్యావసర సరుకుల సరఫరా లేక అక్కడి నివాసితులు అల్లాడిపోతున్నారు.
పీఓకేలో జరుగుతున్న ఈ మానవహక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయంగానూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలోని వాషింగ్టన్లో స్థిరపడిన పీఓకే ప్రవాసులు, మహిళలు, చిన్నారులతో కలిపి 100 మందికి పైగా వైట్హౌస్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. పీఓకేలోని పౌర నివాస ప్రాంతాల నుంచి పాక్ సైన్యాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, నిరాయుధులైన పౌరులపై బలప్రయోగాన్ని అడ్డుకోవాలని వారు అంతర్జాతీయ సమాజాన్ని విజ్ఞప్తి చేశారు.
Also Read : పాకిస్థాన్కు చెక్! ఆఫ్ఘన్ శరణార్థులకు అభయమిచ్చిన ఇండియా..
పీఓకేలో పాక్ కొనసాగిస్తున్న దమనకాండపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో జరుగుతున్న వ్యవస్థాగత దోపిడీ, బలవంతపు ఆక్రమణలు, పరిపాలనాపరమైన అణచివేత వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ స్పష్టం చేశారు. నిత్యావసరాల సరఫరా నిలిపివేత, ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ద్వారా ప్రజలను హింసించడం పాక్ క్రూరత్వానికి నిదర్శనమని భారత్ విమర్శించింది.
మరోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పీఓకే ప్రజలు తమను కాపాడాలంటూ భారత్కు అసాధారణ విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో సహాయం అందించేందుకు, అవసరమైన మందులు, ఆహారం పంపేందుకు పూంచ్, దోడా సెక్టార్ల వద్ద ఉన్న నియంత్రణ రేఖ (LoC) మార్గాలను తెరవాలని వారు ఆశిస్తున్నారు. పాక్ పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాణభయంతో పాటు ఆకలి కేకలతో అలమటిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీఓకే ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఎంతో దారుణంగా ఉన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ‘నేచర్’ జర్నల్ నివేదిక ప్రకారం, అక్కడి జనాభాలో 66% మంది వ్యవసాయం, పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, 57% కంటే ఎక్కువ కుటుంబాలకు ఆహార భద్రత లేదు. అంతేకాకుండా 29% మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు (ఇది పాకిస్తాన్ జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ). పర్వత ప్రాంతాల్లో ఏకంగా 90% కుటుంబాలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటుండటం అక్కడి మానవతా సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది.
Also Read : నేపాల్ సరిహద్దులో అమెరికన్ కలకలం: పాస్పోర్ట్ లేకుండా ఏడు నెలలుగా ఇండియాలో!









