Chandrababu : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు గుడ్ న్యూస్ తెలిపింది. మహిళా సాధికారతను ప్రోత్సహించడంలోనూ, గ్రామీణ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంలోనూ పొదుపు సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే కఠినమైన సాంకేతిక నిబంధనల వల్ల రుణాలు అందక ఇబ్బందులు పడుతున్న వేలాది మహిళా సంఘాలకు ఈ నూతన సడలింపులు ఎంతగానో ఉపకరించనున్నాయి.

Also Read : తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్!

ఇప్పటివరకు ఉన్న రూల్స్ ప్రకారం.. ఒక పొదుపు సంఘం తదుపరి విడత రుణాన్ని పొందాలంటే ఆ గ్రూప్‌లో తప్పనిసరిగా కనీసం 10 మంది సభ్యులు ఉండాల్సిందే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో రకరకాల కారణాల వల్ల సభ్యుల సంఖ్య తగ్గుతుంటుంది. ముఖ్యంగా అనుకోకుండా ఎవరైనా సభ్యురాలు మరణించినా, లేదా ఉపాధి నిమిత్తం కుటుంబంతో సహా వేరే ప్రాంతాలకు వలస వెళ్లినా గ్రూప్‌లోని సభ్యుల సంఖ్య 10 కంటే తగ్గిపోతుంది. అలా సభ్యుల సంఖ్య తగ్గిన వెంటనే బ్యాంకులు తదుపరి విడత రుణాలు ఇవ్వడానికి నిరాకరించేవి. దీనివల్ల నిబంధనలు సరిగ్గా పాటిస్తున్న మిగిలిన మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవారు.

మహిళల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ గ్రామీణ బ్యాంక్ ఈ నిబంధనను సడలించింది. ఇప్పుడు పొదుపు సంఘంలో కనీసం 8 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నప్పటికీ వారికి రిపీట్ డోస్ రుణాలను మంజూరు చేస్తారు. అయితే సభ్యుల సంఖ్య తగ్గడానికి కేవలం అనారోగ్యం/మరణం లేదా వలసలు మాత్రమే కారణమై ఉండాలి. అంతేకాకుండా ఆ గ్రూప్ గతంలో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించి ఉండాలి.

ఈ కొత్త వెసులుబాటును వినియోగించుకోవాలనుకునే పొదుపు సంఘాలు కొన్ని షరతులకు లోబడి ఉండాల్సి ఉంటుంది. సభ్యుల సంఖ్య తగ్గడానికి గల సరైన కారణాన్ని పేర్కొంటూ గ్రూప్ సభ్యులంతా కలిసి ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించి బ్యాంకుకు సమర్పించాలి. అలాగే రుణం పొందిన తేదీ నుంచి తదుపరి 6 నెలల వ్యవధిలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేస్తూ సభ్యుల సంఖ్యను తిరిగి కనీసం 10కి పెంచుతామని హామీ పత్రాన్ని అందించాలి. దీనితో పాటు రుణం పొందిన తర్వాత కూడా నెలవారీ వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : నకిలీ కాల్‌ సెంటర్ల నెట్‌వర్క్‌ను ఛేదించిన TG CSB