
Largest Aerial Attack : రష్యా, ఉక్రెయిన్ల మధ్య సాగుతున్న యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. రష్యా దాడులను ఎదుర్కొంటూనే ఉక్రెయిన్ తన దాడులను తీవ్రతరం చేసింది. శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు రష్యాపై ఏకంగా వెయ్యికిపైగా డ్రోన్లతో భీకరదాడికి దిగింది. రష్యా రాజధాని మాస్కోలోని పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగించింది. రష్యా కూడా ఈ దాడులను ధృవీకరించింది. ఉక్రెయిన్ దాడులను సమర్థవంతగా తిప్పికొట్టామని, ఈ దాడుల్లో సుమారు ఎనిమిది వందల వరకు డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించడం గమనార్హం.
ఉక్రెయిన్ జరిపిన దాడులతో మాస్కో ఆయిల్ రిఫైనరీకి సమీపంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా పొగవ్యాపించింది. ఈ దాడుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పొగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన దాడులు తీవ్రతరం చేయడంతో రష్యాలోని ప్రధాన విమానశ్రయాలను మూసివేయడంతో పాటు పలు విమనాలను రద్దు చేశారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయని ఆ దేశ విమానయాన శాఖ తెలిపింది.
గడిచిన ఐదేళ్లుగా ఉక్రెయిన్, రష్యాల మధ్య సాగుతున్న యుద్ధంలో కీవ్.. మాస్కోపై చేసిన అతిపెద్ద దాడుల్లో ఇదీ ఒకటని రష్యా మీడియా కథనాలు వెల్లడించడం గమనార్హం. క్రిమియాపైనా ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోందని అక్కడి మీడియా తెలిపింది. ఉక్రెయిన్ తాజా దాడుల్లో సైనిక సరఫరాలను, విద్యుత్తు వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకుందని తెలుస్తోంది. దీంతో అవి స్తంభించిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు క్రిమియాలోని క్షిపణి వ్యవస్థలపై దాడి చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ దాడులకు ప్రతీకారంగా రష్యా ఆదివారం తెల్లవారుజామున కీవ్లోని అనేక ప్రాంతాలపై డ్రోన్లతో దాడికి దిగింది. ఈ దాడుల్లో అనేక నివాసాలు, దుకాణాలు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.









