Commercial LPG Price : హోటళ్లు, రెస్టారెంట్లు,ఇతర వాణిజ్య సంస్థలకు ఆగస్టు నెల మొదటి రోజే చమురు మార్కెటింగ్ సంస్థలు తీపి కబురు అందించాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ (Commercial LPG) సిలిండర్ ధరలపై రూ.200కు పైగా భారీ కోత విధిస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించాయి. ఈ నూతన తగ్గింపు ధరలు శనివారం నుంచే అమలులోకి వస్తున్నట్లు తెలిపాయి.

ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా గతంలో ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడి, ధరలు అనూహ్యంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితులు కొంత సర్దుమణగడం, సరఫరాలు క్రమంగా పునరుద్ధరణ కావడం ,అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలు తగ్గడంతో చమురు సంస్థలు ఈ ధరల తగ్గింపు నిర్ణయాన్ని తీసుకున్నాయి.

వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఇది వరుసగా రెండో నెలలో లభించిన పెద్ద ఉపశమనం కావడం విశేషం. జులై నెలలోనే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరపై రూ.183 మేర తగ్గించిన చమురు సంస్థలు, తాజాగా ఆగస్టు 1న మరో రూ.200కు పైగా (రూ.202 వరకు) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వ్యాపార వర్గాల నుండి హర్షం వ్యక్తమవుతోంది.

ఈ భారీ తగ్గింపుతో దేశరాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.202 తగ్గి, రూ.2,728కి చేరింది. కోల్‌కతాలో రూ.209 తగ్గడంతో అక్కడి ధర రూ.2,872.50కి దిగొచ్చింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఈ సిలిండర్ ధర రూ.2,985గా నమోదు కాగా, ముంబై, చెన్నై సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాలు, పట్నా వంటి ప్రాంతాల్లో కూడా ధరలు గణనీయంగా తగ్గాయి.

Also Read : రాఫెల్, బ్రహ్మోస్ అవసరమే లేదు.. భారత్ సరికొత్త సీక్రెట్ వెపన్ రెడీ!

ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరిన సమయంలో హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరాపై ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. అయితే, పరిస్థితులు మెరుగుపడటంతో ఆ ఆంక్షలను జూన్ నెలలోనే ఎత్తివేసి, యుద్ధ సంక్షోభానికి ముందున్న స్థాయికి సరఫరాలను పునరుద్ధరించింది. సరఫరా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుండటంతో చమురు సంస్థలు ఈ తగ్గిన ధరల ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి.

వాణిజ్య రంగానికి ఊరట లభించినప్పటికీ, గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పూ చేయలేదు. దీంతో సాధారణ, మధ్యతరగతి குடும்பాలకు ఈ సారి కూడా ఎలాంటి ఆర్థిక ఉపశమనం లభించనట్లయింది. డొమెస్టిక్ గ్యాస్ ధరలను యథాతథంగా ఉంచడంతో సామాన్యులు కొంత నిరాశకు గురయ్యారు.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగిరావడంతో రాబోయే రోజుల్లో సాధారణ ఎల్పీజీతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయా అనే ప్రచారం జోరందుకుంది. ఇంధన ధరల కోతపై సామాన్య ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నప్పటికీ, పెట్రోల్-డీజిల్ లీటరు ధర తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం గానీ, పెట్రోలియం సంస్థలు గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

వాస్తవానికి లీటర్ పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ ధరల నిర్ణయం అనేది కేవలం ఒక్క అంశంపైనే ఆధారపడి ఉండదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు లభ్యత, అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు ,రవాణా వ్యయాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల కమర్షియల్ ఎల్పీజీ తగ్గినా పెట్రోల్ ధరలు వెంటనే తగ్గిపోతాయని చెప్పలేమని, గ్లోబల్ ట్రెండ్స్ , చమురు ధరల స్థిరత్వాన్ని పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also Read : నోరుజారి మాట్లాడా మోదీజీ.. క్షమించండి : యువతీ వీడియో వైరల్

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.