ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన నౌక ఒకటి భారత జలాల వైపు రావడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో భారత్ నౌకాదళం రక్షణ శక్తిని పెంచేందుకు ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. శత్రు దేశాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఒకేసారి మూడు అత్యాధునిక యుద్ధనౌకలను నేవీలోకి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మూడు నౌకల్లో శత్రువుల కంటికి చిక్కని ‘ఐఎన్ఎస్ దూనగిరి’ అనే భారీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధనౌకతో పాటు, సముద్ర గర్భంలోని రహస్యాలను కనిపెట్టే ‘ఐఎన్ఎస్ సంశోధక్’, శత్రువుల జలాంతర్గాములను ముంచేసే ‘ఐఎన్ఎస్ అగ్రయ్’ ఉన్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ముక్కోణపు ఆయుధాలు.. అటు అరేబియా సముద్రంలో, ఇటు హిందూ మహాసముద్రంలో చైనా, పాకిస్తాన్‌ల ఆటలు సాగకుండా భారత్‌కు తిరుగులేని రక్షణ కవచంలా ఉండనున్నాయి.

ఐఎన్ఎస్ దూనగిరి

ఇది 6,670 టన్నుల బరువున్న అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక. ఇది శత్రువుల రాడార్లకు దొరకకుండా ప్రయాణించగలదు. దీనిపై ప్రమాదకరమైన ‘బ్రహ్మోస్’ -ఉపరితల క్షిపణులు, గగనతలంలో శత్రువుల విమానాలను పేల్చేసే మిస్సైల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ (P-17A) కింద మొత్తం 7 నౌకలు తయారు చేస్తుండగా.. ఇప్పటికే నాలుగు నౌకలు నేవీలోకి వచ్చాయి. మిగిలిన రెండు ఈ ఏడాది చివరలో రానున్నాయి.

ఐఎన్ఎస్ సంశోధక్

సముద్రంలో శత్రు దేశాల దొంగ నౌకలు ఎక్కడ దాక్కున్నాయో కనిపెట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. లోతైన సముద్ర గర్భంలో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేయడానికి, ఆటోమేటిక్ అండర్ వాటర్ వెహికల్స్ ద్వారా సముద్ర డేటాను సేకరించడానికి దీనిని వాడుతారు.

ఐఎన్ఎస్ అగ్రయ్

తీర ప్రాంతాల్లోకి వచ్చే శత్రువుల జలాంతర్గాములను వేటాడి నాశనం చేయడానికి ఇది స్పెషలిస్ట్. దీనిపై స్వదేశీ రాకెట్ లాంచర్లు, తేలికపాటి టార్పెడోలు ఉంటాయి. ఇలాంటి 8 నౌకలను తయారు చేస్తుండగా.. ఇప్పటికే అర్నాలా, అంజదీప్, ఆండ్రోత్ అనే మూడు నౌకలు సేవల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇది నాలుగోది. ఈ మూడు నౌకలను కోల్‌కతాలోని ‘గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్’, ఎల్ అండ్ టీ సంస్థలు నిర్మించాయి. వీటిలో 75 శాతం పైగా భారత్‌కు చెందిన విడిభాగాలనే వాడారు.