
India : అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలో భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. న్యూజెర్సీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఒక అరుదైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదు కాగా, న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ పాల్గొన్న క్వీన్స్ పరేడ్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం, అమెరికా 250వ వార్షికోత్సవం సందర్భంగా న్యూజెర్సీలోని పార్సిప్పానీలో ఉన్న వెటరన్స్ మెమోరియల్ పార్క్లో ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఇందులో 1,300 కంటే ఎక్కువ అమెరికన్ జెండాలతో 250 అనే సంఖ్యను రూపొందించి, దానికి చుట్టూ భారత త్రివర్ణ పతాకాలను అమర్చారు. దీంతో అత్యధిక జెండా స్తంభాలతో ఒక సంఖ్యను రూపొందించినందుకు గిన్నిస్ రికార్డ్ నమోదైంది.
న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్, ఫెడరల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ , జోహో సంస్థల భాగస్వామ్యంతో ఈ ఈవెంట్ జరిగింది. భారత్-అమెరికా స్నేహానికి, అక్కడ స్థిరపడిన భారతీయుల పాత్రకు ఇది ఒక గొప్ప నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు. న్యూజెర్సీ లెఫ్టినెంట్ గవర్నర్ డెల్ కాల్డ్వెల్, కాన్సుల్ జనరల్ బినయ్ శ్రీకాంత ప్రధాన్, పార్సిప్పానీ మేయర్ పుల్కిత్ దేశాయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆగస్టు 15ను ఇండియా డేగా గుర్తిస్తూ పలు అమెరికా రాష్ట్రాల గవర్నర్లు ప్రకటనలు విడుదల చేశారు. ఆదివారం మాన్హాటన్ వీధుల్లో జరిగే 44వ ఇండియా డే పరేడ్లో తారక్ మెహతా కా ఊల్టా చష్మా టీమ్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.









