Donald Trump
Donald Trump

Iran War : ఇరాన్‌పై సైనిక చర్య తీవ్రతరం చేసే ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా వాయిదా వేశారు. తమ వద్దనున్న ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల్లో క్షిపణుల నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయనే నివేదికల నేపధ్యంలోనే వాషింగ్టన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ మిలిటరీ సలహాదారులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం, ప్రస్తుతానికి దౌత్య మార్గాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్ నిర్ణయించారు.

ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అమెరికా పశ్చిమాసియా దళాల వద్ద ఇంటర్‌సెప్టర్ల కొరత ఏర్పడటమే. ఇరాన్ నామమాత్రపు ఖర్చుతో కేవలం 20 వేల నుంచి 50 వేల డాలర్ల విలువైన డ్రోన్లను భారీగా ప్రయోగిస్తుండగా, వాటిని ధ్వంసం చేసేందుకు అమెరికా ఒక్కోదానికి 1.5 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువున్న అధునాతన ఇంటర్‌సెప్టర్ క్షిపణులను వాడాల్సి వస్తోంది. ఈ ఆర్థిక, సాంకేతిక వ్యత్యాసం దీర్ఘకాలిక యుద్ధంలో అమెరికాపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపడమే గాక, క్షిపణి నిల్వలను వేగంగా ఖాళీ చేస్తోంది.

గల్ఫ్ రీజియన్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడుల తీవ్రతను పెంచడంతో, వాటి రక్షణ కోసం అమెరికా దళాలు తమ వద్ద ఉన్న ‘పేట్రియాట్’ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్లను భారీగా ఉపయోగించాల్సి వచ్చింది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే పశ్చిమాసియాలో అమెరికా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే ‘యూఎస్ సెంట్రల్ కమాండ్’ (CENTCOM) వద్ద రక్షణ ఆయుధాల నిల్వలు గణనీయంగా తగ్గిపోతాయని, ఇది తమ సొంత దళాల భద్రతకే ముప్పుగా పరిణమిస్తుందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ హెచ్చరించారు.

అమెరికా రక్షణ రంగానికి సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం కూడా తక్షణమే ఈ లోటును భర్తీ చేసే పరిస్థితిలో లేదు. అధునాతన పేట్రియాట్, థాడ్ (THAAD) క్షిపణుల తయారీకి నెలల సమయం పడుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా అమెరికా ఇప్పటికే ఆయుధ సరఫరా చేసిన నేపథ్యంలో, డిఫెన్స్ ప్రొడక్షన్ లైన్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. దీంతో తక్షణమే కొత్త ఇంటర్‌సెప్టర్లను మిడిల్ ఈస్ట్‌కు తరలించడం పెంటగాన్‌కు సవాలుగా మారింది.

ఈ పరిస్థితిపై వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ స్పందిస్తూ.. ట్రంప్ ప్రభుత్వం అనవసర యుద్ధాల కంటే దౌత్యపరమైన పరిష్కారాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. అయితే, గల్ఫ్‌లో తమ మిత్రదేశాలు లేదా అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తే మాత్రం ఊరుకునేది లేదని, తగిన రీతిలో ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు. దాడుల తీవ్రతను తగ్గించి నిలకడ సాధించడమే ప్రస్తుతం అమెరికా మొదటి లక్ష్యంగా కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే సంక్షోభ నివారణకు అమెరికా దౌత్య మార్గాలను ముమ్మరం చేసింది. ఇరాన్‌తో చర్చలు జరిపి ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహించాలని అధ్యక్షుడు ట్రంప్ ఖతార్, పాకిస్థాన్ దేశాలను కోరినట్లు సమాచారం. ఒకవైపు మిలిటరీ వ్యూహాలను పునఃసమీక్షించుకుంటూనే, మరోవైపు దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా ఇరాన్‌ను శాంతింపజేసే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.