Strait Of Hormuz : యుద్ధంలో ఇరాన్‌ ను ఓడించి హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌చేసిన వ్యాఖ్యలపై ఇరాన్‌ మండిపడింది. హర్మూజ్‌ జలసంధిపై పూర్తి నియంత్రణ అమెరికాదేనంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. హర్మూజ్‌జలసంధి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటుంది.. దానిని ఎవరూ ఆక్రమించుకోలేరు అంటూ ఇరాన్ కౌంటర్‌ ఇచ్చింది. హర్మూజ్‌ను మూసి ఉంచాలా? తెరవాలా? అనేది తమ నిర్ణయంపై మాత్రమే ఆధారపడి ఉంటుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ స్పష్టం చేశారు. యుద్ధ నౌకలను మోహరించడం ద్వారా జలసంధిని స్వాధీనం చేసుకోవాలనుకోవడం భ్రమ మాత్రమేనని ఎక్స్‌ పోస్ట్‌లో తీవ్రంగా బదులిచ్చారు. అగ్రరాజ్యం తన భ్రమలను విడిచిపెట్టి.. ఓటమిని అంగీకరించే వరకు హర్మూజ్‌పై ఇరాన్ దిగ్బంధనాన్ని అమలు చేస్తూనే ఉంటుందని తేల్చిచెప్పారు. తాము ఎవరి బెదిరింపులకు భయపడబోమని.. సైనిక ప్రదర్శనలకు లొంగబోమని ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

Also Read : హోర్ముజ్ కష్టాలకు పుతిన్ చెక్: రష్యాతో భారత్ సరికొత్త డీల్!

మరోవైపు హర్మూజ్‌ ద్వారా నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయని అమెరికా చెబుతున్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ కూడా పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే.. జలసంధి పూర్తిగా ఇరాన్‌ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారు. తమ సాయుధ దళాల అనుమతి లేకుండా ఏ వాణిజ్య నౌక కూడా ఈ మార్గంలో ప్రయాణించబోదని తేల్చి చెప్పారు. హర్మూజ్‌ విషయంలో అమెరికా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

కాగా, శనివారం ట్రంప్‌ మాట్లాడుతూ యుద్ధంలో ఇరాన్‌ను ఓడిస్తామని.. ఆ దేశం ఓటమిని చవిచూసిన తర్వాత హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. ఇరాన్‌ వద్ద అణ్వాయుధ సామర్థ్యం ఉండడం ఎప్పటికైనా ప్రమాదమేనన్న ట్రంప్‌.. ఆ దేశాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో యుద్ధానికి దిగినట్లు స్పష్టం చేశారు.

Also Read : అమెరికాకు బిగ్ షాక్.. ఇరాన్‌కు యూఏఈ రెండు టన్నుల బంగారం.. ఎందుకో తెలుసా?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.