Nampally Court : తెలంగాణ శాసనసభ ఆవరణలో సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, సభాధ్యక్షుడిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల అనుచిత వ్యాఖ్యల కేసులో బిగ్‌ ట్విస్ట్‌ నెలకొంది. స్పీకర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్‌ చేసిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి కోర్టు లో బిగ్ రిలిఫ్‌ లభించింది. ఈ కేసులో వారికి రిమాండ్‌ విధించాలని పోలీసులు దాఖలు చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించడం సంచలనంగా మారింది. అసెంబ్లీ పరిసరాల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు,నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం వారిని నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ ఘటనపై ఇరువర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి, పోలీసుల రిక్వెస్ట్‌ను తోసిపుచ్చడం గమనార్హం. నిందితులిద్దరూ చెరో రూ.10,000 చొప్పున వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రెండు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే వారిని తక్షణమే విడుదల చేయాలని కోర్ట తీర్పునిచ్చింది. కాగా, ఈ తీర్పు అధికార పక్షానికి, పోలీసు శాఖకు ఊహించని పరిణామంగా మారింది.

Also Read : ఐఏఎస్‌ పీఎస్‌కు అస్వస్థత.. సీపీఆర్‌ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి..కానీ..

తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు

మరో వైపు తెలంగాణ శాసనసభ ఆవరణలో సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, ఘర్షణలకు సంబంధించిన వివాదంపై తెలంగాణ హైకోర్టు లో ప్రభుత్వ, ప్రతిపక్ష న్యాయవాదుల వాదనలు ముగిశాయి. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన వెకేట్‌ స్టే పిటిషన్‌ పై విచారణ పూర్తయింది. అయితే ఈ తీర్పును రిజర్వు చేస్తున్నట్లుగా కోర్టు ప్రకటించింది. అసెంబ్లీ ఎంట్రెన్స్ గేటు వద్ద నిరసనలకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, పరస్పర దాడి పరిణామాలపై నిన్న హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.

అదే సమయంలో, ఇవాళ విచారణ సందర్భంగా హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. శాసనసభ్యులు సభా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే సర్వాధికారం కేవలం శాసనసభాపతికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.ఇందులో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకునే అధికారం లేదని హైకోర్టు తేల్సి చెప్పింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు వెలువరించబోయే తుది తీర్పుపై అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

Also Read : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆర్టీసీ, మెట్రో జాయింట్‌ పాస్‌

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.