
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్న పోలీసులతో సోమవారం తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వారిని ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే కోర్టు వారికి రిమాండ్ విధించడానికి నిరాకరించింది. ఇదిలా ఉండగా ఈ అంశంపై అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహా సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా తీర్మానం చేయడం గమనార్మం. కాగా తీర్మానం కాపీని ఆ తర్వాత మండలి చైర్మన్కు పంపించారు.
Also Read : ఐఏఎస్ పీఎస్కు అస్వస్థత.. సీపీఆర్ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి..కానీ..
స్పీకర్పై వ్యాఖ్యల అంశంలో మండలిలోనూ తీవ్ర చర్చ సాగింది. రాష్ట్రంలో BRS పార్టీ ఉండటానికి వీల్లేదనీ, ఆ పార్టీని రద్దుచేయాలని కాంగ్రెస్ సభ్యుడు మహేష్గౌడ్ డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. కాగా ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయాలని చేసిన తీర్మానాన్ని మండలికి పంపిన అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. కాగా ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దుపై మంత్రులు శాసన మండలిలో తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు అనంతరం దీనిపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మండలిలో మాట్లాడిన అనంతరం వారిపై చర్యలు తీసుకునే అంశం పై తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అయితే ఈ విషయంలో భిన్న వాదనలు వినపడుతున్నాయి. రూల్స్ ప్రకారం సభ్యులను సస్పెండ్ చేసే అధికారం మాత్రమే ఉందని, వారిని బహిష్కరించే అవకాశం లేదని తెలుస్తోంది. వారిపై ఎథిక్స్ కమిటీకి రిపోర్టు చేయవచ్చని ఆ కమిటీ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
Also Read : అసెంబ్లీకి వెళ్లే ప్రజాప్రతినిధులను అడ్డుకోవడానికి వీల్లేదు.. హైకోర్టు సంచలన ఆదేశాలు







