Supreme Court Raises Big Question on Reservation
Supreme Court Raises Big Question on Reservation

Supreme Court : NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న అభ్యర్థులకు, విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తీవ్రమైన నేర చరిత్ర లేని నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను (FIRs) చట్ట ప్రకారం ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఢిల్లీ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. తీవ్ర నేరాలకు పాల్పడని విద్యార్థులపై కేసులు కొనసాగకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలపడం గమనార్హం.

ఈ సందర్భంగా ‘తీవ్రమైన నేరచరిత్ర’ అనే అంశంపై ధర్మాసనం స్పష్టత నిచ్చింది. హత్య, అత్యాచారం, ఉగ్రవాదం వంటి అత్యంత తీవ్రమైన నేరాలకు మాత్రమే ఈ పదం వర్తిస్తుందని, చిన్నచిన్న కేసులు లేదా నిరసనల్లో పాల్గొన్న వారిని ఈ కోవలోకి తెచ్చి భవిష్యత్తును నాశనం చేయకూడదని అభిప్రాయపడింది. అయితే, ఇప్పటికే పెద్ద ఎత్తున తీవ్రమైన నేర చరిత్ర కలిగిన 2,700 మందికి పైగా వ్యక్తులపై ఉన్న కేసులను మాత్రం వెనక్కి తీసుకోబోమని కేంద్రం నిష్కృష్టంగా తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు పౌరులందరికీ ఉంటుందని న్యాయస్థానం పునరుద్ఘాటించింది.

జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో పార్లమెంటు వైపు వెళ్తున్న నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగించిన తీరుపై కోర్టులో తీవ్ర చర్చ జరిగింది. నిరసనల సమయంలో న్యాయవాదుల పిల్లలపై కూడా దాడులు జరిగాయని, దీనికి సంబంధించి 300 వీడియోలను సమర్పించామని సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ కోర్టు దృష్టికి తెచ్చారు. కేవలం ఆందోళనలు జరుగుతున్నాయనే నెపంతో పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడాన్ని, లాఠీచార్జి చేయడాన్ని సమర్థించలేమని కోర్టు గతంలోనే హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేస్తూ, పోలీసుల దురాగతాలపై విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు.

శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ఆందోళనకారులపై పెల్లెట్ తుపాకుల వినియోగంపై సమగ్ర మార్గదర్శకాలు రూపొందిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో వాటిని ఉపయోగించవచ్చో స్పష్టమైన నిబంధనలు తెస్తామని తెలిపింది. దీంతోపాటు నిరసనల్లో జరిగిన సంఘటనలపై సమగ్ర విచారణ కోసం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు తదుపరి సమగ్ర విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 19వ తేదీకి వాయిదా వేసింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.