SpaceX Rocket : గత కొంతకాలంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఉహించిన విధంగానే స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శకలం ఒకటి చంద్రుడి ఉపరితలంపై కూలింది. గంటకు 8,700 కిలోమీటర్ల వేగంతో ఆ రాకెట్‌కూలిపోయింది. కాగా, ఆ శకలం చంద్రుడిని ఢీకొట్టడానికి ముందు, తర్వాతి దృశ్యాలను దక్షిణ కొరియా శాటిలైట్ చిత్రీకరించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గతంలో రెండు స్పేస్‌ క్రాఫ్ట్‌లను భూమ్మీది నుంచి తీసుకెళ్లి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఈ స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ పైభాగం (అప్పర్‌ స్టేజ్‌) ఒకటి…దాని కక్ష్య తప్పటంతో అది నేరుగా వెళ్లి చంద్రుడి ఉపరితలంపై కూలినట్లు వారు వివరించారు. కాగా, అది కూలుతున్న సమయంలో కొరియాకు చెందిన దనూరి స్పేస్‌క్రాఫ్ట్ ప్రభావిత ప్రాంతం మీదుగా ప్రయాణిస్తుండటంతో అది చంద్రుడి కక్ష్య నుంచి శకలానికి సంబంధించిన ఫొటోలు తీసింది. ఈ మేరకు దక్షిణకొరియా అంతరిక్ష సంస్థ తాజాగా ఆ ఫొటోలను విడుదల చేసింది. కాగా, ఆ శకలం ఢీకొట్టినప్పుడు చంద్రుడిపై ఒక గొయ్యి ఏర్పడినట్లు తెలుస్తోంది. దానితో పాటు పెద్ద ఎత్తున దుమ్ము, రాళ్లను వెదజల్లింది. క్రాష్‌కు ముందు చిత్రాలతో పోల్చిప్పుడు ఆ ప్రాంతం నల్లగా కనిపించింది. దక్షిణ కొరియా తొలి మూన్‌ మిషన్‌ ‘దనూరి’ని 2022 ఆగస్టులో ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ రాకెట్ నుంచే లాంచ్ చేయడం గమనార్హం.

Also Read : అమెరికా వెళ్లే విద్యార్థులకు బిగ్ షాక్.. 60 శాతం తగ్గిన వీసాలు!

కాగా చంద్రనిపై పడిన శకలం దాదాపు 4500 కిలోల బరువు.. 39 అడుగుల పొడుగు.. ఐదంతస్తుల భవనం అంత ఉంటుందని తెలుస్తోంది. ఈ శకలం ఫాల్కన్‌ 9 రాకెట్‌ పైభాగానికి చెందినది. గత ఏడాది జనవరిలో ఆ రాకెట్‌ను ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్‌ కంపెనీకి చెందిన బ్లూఘోస్ట్‌, ఐస్పే్‌స్‌కు చెందిన రిసైలియన్స్‌ అనే రెండు ప్రైవేటు లూనార్‌ ల్యాండర్లను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సమయంలో అది నియంత్రణ కోల్పోయింది. దీంతో భూమి, చంద్రుడి మధ్య కక్ష్యలో తిరుగుతూ.. క్రమంగా కక్ష్యమారింది. అనంతరం గురుత్వాకర్షణ కారణంగా చంద్రుడివైపు అదుపు లేని వేగంతో దూసుకెళ్లి, చంద్రుడి పడమటి దిక్కున ఉన్న ‘ఐన్‌స్టీన్‌ క్రేటర్‌’కు సమీపంలో కూలినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అది చంద్రుడిని ఢీకొనగానే 3 టన్నుల టీఎన్‌టీ పేలుడుతో సమానమైన శక్తి విడుదలైనట్టు శాస్త్రజ్ఞులు వివరించారు. 3 టన్నుల టీఎన్‌టీ అంటే… 15వేల డైనమెట్‌ స్టిక్స్‌ ఒకేసారి పేలితే ఎంత శక్తి విడుదలవుతుందో అంత శక్తి అని వారు పేర్కొన్నారు. దాని దెబ్బకు చందమామ ఉపరితలంపై కొత్తగా మరో గుంత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ భారీ గుంత వ్యాసం దాదాపుగా 90 అడుగులు.. లోతు దాదాపు 16 అడుగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాకెట్‌ అప్పర్‌స్టేజ్‌ చంద్రుడిపై కూలుతున్న సమయంలో.. నాసాకు చెందిన లూనార్‌ రికన్నైజాన్స్‌ ఆర్బిటర్‌, దక్షిణకొరియాకు చెందిన దనూరి స్పేస్‌క్రాఫ్ట్‌ జాబిలి కక్ష్యలోనే తిరుగుతున్నాయి. కానీ.. కూలిన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసే చోట అవి లేవు. అది కూలడానికి కేవలం రెండు నిమిషాల ముందే దనూరి స్పేస్‌క్రాఫ్ట్‌ ఆ ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్లిపోవడంతో కూలే దృశ్యాన్ని రికార్డు చేయలేకపోయింది. అది అలా వెళ్లేటప్పుడు తీసిన ఫొటోలను.. చంద్రుణ్ని చుట్టి మళ్లీ అదే ప్రదేశానికి వచ్చినప్పుడు తీసిన ఫొటోలను విశ్లేషించి, త్వరలో విడుదల చేస్తామని దక్షిణ కొరియా అంతరిక్ష సంస్థ ‘కొరియా ఏరోస్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (కాసా)’ వివరించింది.

Also Read : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు… బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్‌

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.